
వరద బాధిత ప్రజలకు తమ సంఘీభావం, మద్దతును తెలియజేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్ టోర్నీలో భారత్తో జరిగే తొలి మ్యాచ్లో నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించనుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం ప్రకటించింది. 'ఈరోజు భారత్తో జరిగే ఏసీసీ టీ20 ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ మొదటి మ్యాచ్లో చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనుంది' అని PCB ప్రకటించింది. ఇటీవల పాకిస్తాన్లో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వరదల్లో మరణించిన వారి సంఖ్య 1,000 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. జియో న్యూస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) ప్రకారం.. గత 24 గంటల్లో దాదాపు 119మంది వరదల్లో మరణించారు. 71మంది గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 31 మంది, సింధ్లో 76 మంది చనిపోయారు.
గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంతో పాకిస్థాన్ సతమతమవుతోంది. వరదలు లక్షలాది ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల "జాతీయ అత్యవసర పరిస్థితి" ప్రకటించింది. పాకిస్తాన్ 30సంవత్సరాల సగటు వర్షపాతం 134మి.మీ కాగా.. ఈ సంవత్సరం 388.7 మిమీ వర్షం కురిసిందని NDMA పేర్కొనంది. ఆగస్ట్ 26న 190శాతం అధికంగా వర్షం కురిసింది.
ఆసియాకప్ టోర్నీకి ఎంపికైన పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నా.