Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఈ భీకర దాడికి పాల్పడ్డారు. పర్యటకుల్లో పురుషులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడిని భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఖండించారు. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (MI VS SRH) మ్యాచ్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే...
వరుసగా నాలుగు ఓటముల అనంతరం పంజాబ్ కింగ్స్పై విజయంతో గాడినపడ్డట్లే కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స్ చేతిపై ఓటమితో మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఐపీఎల్ IPL 2025లో సన్రైజర్స్ ప్లేఆఫ్ రేసు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇదే సమయంలో మరోవైపు ఓటములతో ప్రారంభించిన ముంబై ఇప్పుడు గెలుపు బాట పట్టింది. తొలి ఐదు ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయంతో అభిమానుల్ని నిరాశపరిచిన ముంబై.. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ విక్టరీ అందుకుంది.

అయితే ఇప్పుడీ రెండు జట్లు తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. సాధారణంగా మ్యాచ్ అంటే బాణాసంచా కాల్చడం, చీర్ లీడర్స్ ఆటపాట ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో ఇవి ఉండట్లేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచులో పాల్గొనే ఆటగాళ్లు, అంపైర్లు కూడా నలుపు బాండ్లు ధరించి, ఘటనలో మరణించినవారికి సంతాపం తెలపనున్నారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంచి చేకూరాలని ప్రార్థించనున్నారు. కాగా, ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడి మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.