Pahalgam Terror Attack: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి భారత్తో పాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించగా.. 20 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడి తర్వాత జమ్మూకశ్మీర్తో పాటు దేశాన్ని శోకసంద్రం అలుముకుంది. రాజకీయ నాయకులే కాకుండా క్రికెటర్లు కూడా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెటర్లు స్పందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేర్లు కూడా చేరాయి. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మహ్మద్ సిరాజ్కు ఆగ్రహం
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా నివాళులర్పిస్తున్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, పహల్గామ్లో జరిగిన భయంకరమైన, విషాదకరమైన ఉగ్రవాద దాడి గురించి ఇప్పుడే చదివానని రాశారు. ఇది చాలా బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో అమాయక ప్రజలను చంపడం చాలా దుర్మర్గమైన, అమానుషమైన చర్య అని.. ఏ కారణం లేదా ఆలోచన అటువంటి క్రూరమైన చర్యను సమర్థించదని సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇది ఎలాంటి పోరాటం, ఇక్కడ మానవ ప్రాణాలకు విలువ లేదు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర దుఃఖం, షాక్ గురించి ఆలోచించడం హృదయాన్ని బాధపెడుతుంది. ఈ కష్ట సమయాన్ని అధిగమించడానికి ఆ కుటుంబాలకు బలం చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి మృతికి చాలా చింతిస్తున్నాము. ఈ హింస త్వరలోనే ఆగిపోతుందని, దోషులకు కఠిన శిక్ష పడుతుందని, తద్వారా వారు ఎవరికీ హాని కలిగించకూడదని ఆశిస్తున్నాను." అని మహ్మద్ సిరాజ్ రాసుకొచ్చాడు.
మతం పేరుతో చంపడం తప్పు- మహ్మద్ షమీ
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పిరికి చర్యపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. "పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి గురించి ఇప్పుడే చదివాను. మతం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని చంపడం పూర్తిగా తప్పు. ఏ కారణం, ఏ భావజాలం కూడా ఇంత భయంకరమైన చర్యను సమర్థించలేదు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల మేము తీవ్రంగా బాధపడుతున్నాము. ఈ పిచ్చి త్వరలోనే ముగిసిపోతుందని, ఈ ఉగ్రవాదులను ఎటువంటి దయ లేకుండా కనుగొని శిక్షించాలని నేను ఆశిస్తున్నాను."అని మహ్మద్ షమీ ఇన్స్టా వేదికగా రాసుకొచ్చాడు.
మతం గురించి అడిగి మరీ చంపేశారు..
ఏప్రిల్ 22 మధ్యాహ్నం ఉగ్రవాదులు స్థానికి పోలీసుల యూనిఫాంలో వచ్చి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే పహల్గామ్లో మృతదేహాల కుప్ప కనిపించింది. ప్రతిచోటా గందరగోళం నెలకొంది. ఉగ్రవాదులు ప్రజలను వారి మతం గురించి అడిగారు. వారిని కల్మా పఠించమని అడిగారు. కల్మా పఠించడంలో విఫలమైన వారిని చంపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉగ్రవాదులు ప్రత్యేకంగా పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు.