Pahalgam Terror Attack: ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ చప్పగా సాగుతోంది. ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ కనపడలేదు. ఆటగాళ్ల మెరుపులు అంతగా కనపడట్లేదు. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ పీఎఎస్ఎల్ 2025లో ఇప్పటివరకు 13 మ్యాచులు పూర్తయ్యాయి. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు పీఎస్ఎల్కు భారత్లో భారీ షాక్ తగిలింది! అదేంటంటే?
అవన్నీ బంద్..
పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్థాన్ తో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సార్క్ వీసా పొడిగింపు స్కీమ్ కింద పాక్ జాతీయులు దేశంలోకి రావడానికి వీల్లేదని పేర్కొంది. భారత్ - పాకిస్థాన్ మధ్య ఉన్న అటారి సరిహద్దు మూసేసింది. పాకిస్థాన్లోని ఇండియన్ ఎంబసీని ముసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పీఎస్ఎల్ పై కూడా భారత్ లో చర్యలు తీసుకోనున్నారని సమాచారం అందింది.

ఇకపై నో టెలికాస్ట్..
ఇప్పటి వరకు పీఎస్ఎల్ మ్యాచులు భారత్ ఫ్యాన్ కోడ్లో లైవ్ స్ట్రీమింగ్ అయ్యేవి. కానీ ఇకపై అలా జరగదు. భారత్ లో పీఎస్ఎల్ ప్రసారాన్ని నిలిపివేసినట్లు తెలిసింది. పహల్గాం దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో పీఎస్ఎల్ డిజిటల్ వ్యూయర్ షిప్ బాగా తగ్గిపోతుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై గట్టి ప్రభావం చూపుతుంది.
కాగా, బైసరన్ లోయలో పహల్గాం దాడి జరిగింది. పర్యాటకులు అత్యధికంగా ఉన్న మూడు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని, ఏప్రిల్ 22న మధ్యాహ్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పురుషులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇడెంటిటీని అడిగి మరీ కాల్చి చంపారు. చాలా మందిని తలపైనే గురిపెట్టి కాల్చారు. మొత్తం 10 నిమిషాల్లో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మొత్తంగా 29 వరకు చనిపోయినట్లు సమాచారం.