76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడాకారుల జోరు కొనసాగింది. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ను 'పద్మభూషణ్' వరించగా, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్లతో పాటు మరికొందరు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
భారత ప్రభుత్వం ఆదివారం (జనవరి 25) మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో క్రీడా రంగానికి చెందిన 8 మంది ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. భారత టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు విజయ్ అమృతరాజ్. ఈ ఏడాది క్రీడా విభాగంలో 'పద్మభూషణ్' (భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం) అందుకున్న ఏకైక క్రీడాకారుడు ఆయనే. ఆయనకు గతంలో 1974లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ లభించాయి. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్కు రెండుసార్లు చేరుకున్న ఘనత ఆయన సొంతం.

భారత క్రికెట్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించిన సారథి కావడం విశేషం. 2025లో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆయన.. వన్డేల్లో ఇప్పటికీ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు.హర్మన్ప్రీత్ కౌర్ 2025లో భారత మహిళల జట్టుకు తొలి ఐసీసీ టైటిల్ (వన్డే ప్రపంచకప్) అందించిన ఘనతను సాధించారు. ఇటీవల జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించారు.
క్రికెటర్లతో పాటు హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో రాణించిన క్రీడాకారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
*సవితా పునియా (హాకీ): భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్.
*ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్): పారా హైజంప్ స్టార్.
*బలదేవ్ సింగ్ (కోచ్): మహిళల హాకీలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కోచ్.
*భగవాన్ దాస్ రైక్వార్.
*కె. పజనివేల్.
*వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలి (కుస్తీ కోచ్): మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
మొత్తం అవార్డులు: 131
పద్మ విభూషణ్: 5
పద్మభూషణ్: 13
పద్మశ్రీ: 113
మహిళా విజేతలు: 19 మంది