షమీ మైల్స్టోన్ రికార్డు
సెంచూరియన్లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో వేగంగా 200 వికెట్లు తీసిన మూడో భారత పేసర్గా నిలిచాడు. షమీ కంటే ముందు కపిల్ దేవ్ 50 టెస్ట్ మ్యాచ్ల్లో, జవగల్ శ్రీనాథ్ 54 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించారు. కాగా షమీ 55 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొమ్మిదో భారత బౌలర్గా నిలిచాడు.

ధోని రికార్డు బ్రేక్ చేసిన పంత్
సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా వంద మందిని ఔట్ చేసిన భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఈ క్రమంలో 26 టెస్టు మ్యాచ్ల్లోనే పంత్ ఈ రికార్డును అందుకున్నాడు. ధోని, వృద్ధిమాన్ సాహా 36 మ్యాచ్ల్లో 100 మందిని ఔట్ చేశారు.

బుమ్రా సెంచరీ
సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో వేగంగా 100 వికెట్లు తీసిన టీమిండియా పేసర్గా నిలిచాడు. 23 మ్యాచ్ల్లో బుమ్రా ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు బుమ్రా తన కెరీర్లో 25 టెస్టు మ్యాచ్లు ఆడగా 23 మ్యాచ్లు విదేశాల్లోనే ఆడాడు. విదేశాల్లో 102, స్వదేశంలో 4 వికెట్లు కలిపి ఇప్పటివరకు తన ఖాతాలో 106 వికెట్లను వేసుకున్నాడు. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












