ధావన్కూ చాన్స్:
పురుషులు, మహిళల విభాగాల్లో వివిధ క్రీడా అవార్డుల కోసం సిఫారసు చేయాల్సిన జాబితాపై బోర్డు ఆఫీసు బేరర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే.. జస్ప్రీత్ బుమ్రాతో పాటు సీనియర్ బ్యాట్స్మన్, ఓపెనర్ శిఖర్ ధావన్కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది. బీసీసీఐ 2018లోనూ ధావన్ పేరును ప్రతిపాదించినా.. అతడికి అర్జున దక్కలేదు.
స్మృతి మంధానకు అవార్డు:
2018లో శిఖర్ ధావన్ను అర్జునకు నామినేట్ చేసినా అవార్డు దక్కలేదు. మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అవార్డుని దక్కించుకుంది. ఇక గతేడాది బుమ్రా, జడేజా, షమీ పేర్లను ప్రతిపాదించగా.. జడేజాకు అవార్డు లభించింది. అప్పటికి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి రెండేళ్లే కావడంతో.. మూడేళ్ల నిబంధన మేరకు జడేజా పేరును ఖరారు చేసినట్టు చెప్పారు.
బుమ్రా అవార్డుకు అర్హుడు:
భారత్ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. 'బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. ఐసీసీ నంబర్వన్ బౌలర్గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డలపై ఇన్నింగ్స్లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
అర్జున రేసులో దీప్తి శర్మ:
మహిళల విభాగం నుంచి కూడా బీసీసీఐ నామినేషన్లను ఖరారు చేయనుంది. మహిళల విభాగంలో దీప్తి శర్మ పేరును అర్జున అవార్డు కోసం సిఫారసు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పేసర్ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది. టీ20 వరల్డ్కప్లో ఆల్రౌండర్గా దీప్తి శర్మ మొదటి మ్యాచ్ నుంచే తన మార్క్ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో 49 పరుగులు చేసిన దీప్తి.. టోర్నీలో మొత్తం 116 చేసింది. మెగా టోర్నీలో ఐదు మ్యాచ్లాడిన శిఖా ఏడు వికెట్లు పడగొట్టగా.. 3/14 బెస్ట్.