జట్టు సమిష్టి కృషి వల్లే విజయం సాధించాం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే స్పష్టం చేసారు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. అద్భుత బౌలింగ్తో మూడు కీలక వికెట్లు తీసి శ్రేయస్ గోపాల్.. ఓపెనర్ జోస్ బట్లర్ (59) అద్భుత అర్ధ సెంచరీతో జట్టు విజయానికి కృషి చేశారు.
గౌతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు:
మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ... ' ఈ రోజు మా ప్రణాళికలు అమలు చేసాం. పాయింట్ల ఖాతా తెరచినందుకు సంతోషంగా ఉంది. పవర్ ప్లేలో కృష్ణప్ప గౌతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోహ్లీ, డివిల్లియర్స్ వికెట్లు తీసి శ్రేయస్ గోపాల్ రికార్డు సృష్టించాడని భావిస్తున్నా. 3-4 ఓవర్ల తరువాత వికెట్ నెమ్మదించింది, దాన్ని మా బౌలర్లు వినియోగించుకున్నారు' అని రహానే తెలిపారు.
100 శాతం సఫలం అయ్యాం:
'గత మూడు మ్యాచుల్లోనూ మేము బాగానే ఆడాం. కానీ ఈ మ్యాచులో మాత్రం 100 శాతం సఫలం అయ్యాం. త్రిపాఠి ఈ మ్యాచ్కు ముందు కాస్త తడబడ్డాడు. కానీ స్టోక్స్, స్మిత్లతో కలిసి బాగా బ్యాటింగ్ చేసాడు. జట్టు సమిష్టి కృషి వల్లే విజయం సాధించాం' అని రహానే చెప్పుకొచ్చారు.