

హైదరాబాద్: మంగళవారంతో వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ ముగిసింది. దీంతో ఐపీఎల్ 2019 వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది.
ఇందులో మొత్తం 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారని వారంతా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ 2019 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. వేలానికి ముందే అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. 800మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్తో పాటు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 800 అన్క్యాప్డ్ ప్లేయర్స్లో 746 మంది ఆటగాళ్లు భారతీయులే కావడం విశేషం. ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.
ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు మొత్తం 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.
మొత్తం 232 మంది ఆటగాళ్లు, దేశం వారీగా రిజిస్టర్ చేసుకున్న వారి జాబితా:
* ఆఫ్ఘనిస్తాన్ 27
* ఆస్ట్రేలియా 35
* బంగ్లాదేశ్ 10
* ఇంగ్లాండ్ 14
* హాంకాంగ్ 1
* ఐర్లాండ్ 1
* నెదర్లాండ్స్ 1
* న్యూజిలాండ్ 17
* దక్షిణాఫ్రికా 59
* శ్రీలంక 28
* అమెరికా 1
* వెస్టిండీస్ 33
* జింబాబ్వే 5