హైదరాబాద్: టాపార్డర్ విఫలం వల్లే రెండో వన్డేలో ఓటమి పాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. పూణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడాడు. 'మా టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడలేకపోయింది. భారత ఓపెనింగ్ బౌలర్లు చాలా చక్కగా ఆడారు. గుడ్ లెన్త్తో బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి' అని విలియమ్సన్ అభిప్రాయపడ్డారు.

'టీమిండియాను ఓడించాలంటే మేం మెరుగ్గా ఆడాలన్న విషయం మాకు తెలుసు. అయితే పిచ్ స్లోగా ఉంది. మేం ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాం. ముంబైలో మంచి ప్రదర్శన ఇచ్చాం. కాన్పూర్లో మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నాం' అని మ్యాచ్ అనంతరం విలియమ్సన్ చెప్పాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 4 ఓవర్లు మిగలుండగానే చేధించింది. తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.