రజినీ సాంగ్తో ధోనీ ఎంట్రీ:
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచులు జరగకున్నా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ సారథికి సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను సంతృప్తి పర్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం సీఎస్కే అధికారిక ట్విట్టర్లో ఎంఎస్ ధోనీ హోటల్ రూమ్ నుంచి టీమ్ బస్సులోకి వెళ్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'సూపర్ స్టార్' రజినీ కాంత్ దర్బార్ సినిమాలోని 'దుమ్ము ధూళి' సాంగ్ని బ్యాక్గ్రౌండ్గా ఆ వీడియోకి సీఎస్కే యాడ్ చేసింది.
చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్:
ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం మార్చి 2న చెన్నైకి వెళ్లిన ధోనీ.. అక్కడి చెపాక్ స్టేడియంలో రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియోకు రజినీ పాటను చెన్నై యాడ్ చేసింది. చెపాక్ స్టేడియానికి వెళ్లేందుకు హోటల్ బ్యాక్ డోర్ నుంచి వచ్చిన ధోనీని అక్కడి సెక్యూరిటీ గార్డ్ చూసి వెంటనే సెల్యూట్ కొట్టాడు. అందుకు బదులుగా ధోనీ కూడా తలూపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న అభిమానులకి తన చేతిలోని ద్రాక్షని చూయించిన ధోనీ.. అనంతరం బస్సులోకి వెళ్లిపోయాడు. వీడియోకి 'స్వీట్ కింగ్ ఇక్కడ.. సింప్లీ రాక్ ఆన్' అని చెన్నై కాప్షన్ జోడించింది.
10 నెలలుగా క్రికెట్కి దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 ప్రపంచకప్ రేసులో ఉన్నాడు.
డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.