వన్డే వరల్డ్ కప్ అనంతరం స్టార్ పేసర్ మహ్మద్ షమి చీలమండ గాయంతో టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. నొప్పితో బాధపడుతూనే ఇంజెక్షన్ల సాయంతో షమి ప్రపంచకప్ ఆడాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్ల్లోనే 24 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. అయితే ప్రస్తుతం కోలుకుంటున్న షమి తన ఫిట్నెస్ గురించి మాట్లాడాడు.
'' ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నా. నా పురోగతిపై NCAలోని వైద్యనిపుణులు సంతోషంగానే ఉన్నారు. చీలమండ సమస్య కాస్త ఉన్నప్పటికే మంచిగానే ఉన్నాను. ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టాను కూడా. ఇంగ్లాండ్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నా. దానికి తగ్గట్టుగానే ఫిట్నెస్ సాధిస్తున్నా'' అని షమి అన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షమి మాట్లాడుతూ.. ''రెండో టెస్టులో గొప్పగా ఆడాం. టీమిండియా బౌలింగ్ అద్భుతంగా చేసింది. తొలి టెస్టు ఓటమి అనంతరం తిరిగి పుంజుకుని సిరీస్ను సమం చేయడం గొప్పగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్ను మిస్ అయ్యాను. అతి త్వరలో తిరిగి మైదానంలో అడుగుపెడతాను. మీరందరూ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో నన్ను తిరిగి చూస్తారు'' అని షమి అన్నాడు.
'' ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం మాదే అని నమ్మకంగా చెబుతున్నా. వన్డే వరల్డ్ కప్లో మా ప్రదర్శన చూశారు. అలాగే సౌతాఫ్రికా సిరీస్లోనూ చూశారు. ఇక సెకండ్ టెస్టులో బుమ్రా, సిరాజ్ అదరగొట్టారు. ప్రపంచంలో ఏ జట్టునైనా సరే, మేం సమర్థంగా ఎదుర్కొంటాం'' అని షమి పేర్కొన్నాడు.
కాగా, జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది. అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.