హైదరాబాద్: అంగరంగ వైభవంగా, భారీ అంచనాలతో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 11) లీగ్ దశ పూర్తి అయింది. జాబితాలో ఆఖరి స్థానంలో కొనసాగుతూ అదే స్థానంతోనే సీజన్ను ముగించింది ఢిల్లీ డేర్డెవిల్స్. ఆఖరి స్థానంలోనే లీగ్ను ముగించినా.. జట్టు ఎంతోకొంత రాణించిందంటే అది యువ ఆటగాళ్ల వల్లనే.. ఢిల్లీ జట్టులో ఉన్న రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, ఆవేశ్ ఖాన్ మ్యాచ్లలో కీలకంగా మారారు. వీరిని ఉద్దేశించి పాంటింగ్ భారత్ ఆటగాళ్లు అద్భుతమైన నైపుణ్యమున్న వాళ్లంటూ కొనియాడాడు.
ఆఖరి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రికీ పాంటింగ్.. ఈ సీజన్కు ఆడిన యువ ఆటగాళ్లను జట్టులో అలాగే ఉంచితే మంచిది. పృథ్వీ షా, అభిషేక్ శర్మ, సందీప్ లామిచానెలతో జట్టుకు బలం చేకూరింది. వీరితో పాటుగా ఆవేశ్ ఖాన్ మరో అద్భుతమైన ఆటగాడు దొరికాడు. జట్టుకు ఈ ఏడాది యువ ఆటగాళ్లు దొరికారు. దీనికి నిదర్శనంగా ఐపీఎల్ 11లో భారత్ ఆటగాళ్ల పరుగులు రికార్డు పరిశీలిస్తే అర్థమౌతోంది.
జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటున్నా ఎప్పటికప్పుడు కొత్తగా మ్యాచ్ ఆరంభించి భారీ పరుగులు చేపట్టారు. యువ ఆటగాళ్లు శ్రద్ధ పెట్టి ఆడితే ఎక్కువ మ్యాచ్లలో ఆరంజ్ క్యాప్ మాకే దక్కేది. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆరంబ్ క్యాప్ మా జట్టుకే చిక్కింది. హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్కు మింగుడుపడని ఫలితాన్ని ఇచ్చాం. ఈ విజయంలో పూర్తి ఘనత రిషబ్ పంత్కే దక్కుతుంది.
కాగా, ఢిల్లీ జట్టు వరుస వైఫల్యాలతో చిక్కుకుపోయిన సమయంలో కెప్టెన్సీలోని వైఫల్యాన్ని ఒప్పుకుంటూ గౌతం గంభీర్ స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ కొద్దిపాటి విజయాలు అందించినా అప్పటికే లీగ్పై ఆశలు కోల్పోవాల్సి వచ్చింది.