హైదరాబాద్: బ్యాటింగ్ చేసేటప్పుడు భయపడకుండా ఆడాలని భారత మహిళల టీ20 తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన జట్టులోని సహచర క్రికెటర్లకు సూచించారు. గురువారం ముంబై వేదికగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలై మూడు టీ20ల సిరీస్ను 2-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే.
రెండో టీ20లో భారత్ ఓటమి: ఇంగ్లాండ్దే టీ20 సిరీస్
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ "దేశవాళి క్రికెట్లో ఎలా ఆడుతామో.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అలానే రాణించాలి. అలాంటప్పుడే భారీ స్కోర్లు చేయగలం. భయానికి, నిర్లక్ష్యానికి కొంత మాత్రమే తేడా. మా బ్యాటర్స్ది నిర్లక్ష్యమని నేను భావించడం లేదు. నాతో సహా మేం భయాన్ని వీడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా" అని అన్నారు.
"అంతేకాకుండా మేం డాట్ బాల్స్ను కూడా తగ్గించుకోవాలి. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. ఆడితే షాట్స్ లేకుంటే డాట్స్.. అన్న తరహాలో మా బ్యాటింగ్ ఉంది. ఇదే మాకు ప్రత్యర్థికి ఉన్న తేడా. దీనిని రాబోయే రోజుల్లో తప్పకుండా మార్చుకుంటా" అని స్మృతి మంధాన వెల్లడించింది.
టీమిండియా నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మహిళల జట్టు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమెకు తోడుగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) ఫరవాలేదనిపించింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. భారత జట్టులో మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) నిరాశపరచగా... మిథాలీ ఒక్కతే 20 పరుగులతో టాప్ స్కోరరగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఐదుగురు భారత్ బ్యాట్స్ఉమెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు తీయగా... లిన్సే స్మిత్ రెండు వికెట్లు... కేట్ క్రాస్, ష్రబ్సోల్లకు తలో వికెట్ తీశారు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20లో ఇంగ్లాండ్ మహిళల జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.