ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది స్టార్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరే క్రికెట్పై చెరగని ముద్ర వేస్తారు. వారందరికీ కూడా అందనంత ఎత్తులో ఉండేవాడు దేవుడు. అతనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, క్రికెట్ను ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చేయడంలో సచిన్ పాత్ర ఎంతో కీలకం. దేశంతో సంబంధం లేకుండా ఎంతోమంది చిన్నారులు బ్యాటు పట్టుకోవడానికి కారణం ఈ ముంబై కుర్రాడు.
అలాంటి సచిన్ ఇదే రోజున సరిగ్గా 33 ఏళ్ల క్రితం తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ప్రపంచ క్రికెట్కు తాను వచ్చానని ఒక ప్రకటన చేశాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్పై నాలుగో ఇన్నింగ్స్లో ఈ సెంచరీ చేయడం గమనార్హం. ఈ మ్యాచ్లో భారత ఓటమిని తప్పించడం కోసం సచిన్ పోరాడాడు. ఒక విధంగా ఈ ఇన్నింగ్స్తోనే క్రికెట్ చరిత్రలో కొత్త యుగం మొదలైందని చెప్పాలి.

ఈ క్రమంలోనే సచిన్ తొలి సెంచరీని బీసీసీఐ గుర్తుచేసుకుంది. బీసీసీఐ సెక్రటరీ జై షా దీనిపై ట్వీట్ చేశాడు. సరిగ్గా ఇదే రోజు 1990లో సచిన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ చేశాడని, తద్వారా ప్రపంచానికి తాను వచ్చాననే సందేశం పంపాడని జై షా ట్వీట్ చేశాడు. ఫ్యాన్స్ కూడా సచిన్ తొలి సెంచరీ చేసిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెంచరీ తర్వాత సచిన్ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
క్రికెట్ ఆడే ప్రతి గడ్డపై, ప్రతి ప్రత్యర్థిపై శతకాలతో చెలరేగాడు. క్రికెట్ చరిత్రలో 100 శతకాలు సాధించిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు అన్ని ఫార్మాట్లలో కలిపి 33 వేలపైగా పరగులు చేసి, ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు. ఇప్పటికి కూడా చాలా మంది స్టార్ ప్లేయర్లు.. సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటేనే.. సచిన్ ఎంత సాధించాడో అర్థం చేసుకోవచ్చు.