
హైదరాబాద్: కోల్కతా జట్టుతో హోరాహోరీగా పోరాడి పరాజయం పాలైన రాజస్థాన్ జట్టు కెప్టెన్ ఓటమిపై కారణాలు విశ్లేషిస్తున్నాడు. ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన రాజస్థాన్ క్రమేపీ దూకుడు తగ్గించింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 142పరుగులు చేసి ఆలౌట్కు గురైంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్లేఆఫ్ రేసులోకి వెళ్లేందుకు ఇరుజట్లకు కీలకంగా వ్యవహరించింది. అయితే ఈ ఓటమిపై రాజస్థాన్ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ సరిగా చేయలేకపోవడంతోనే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయామని తెలిపాడు.
'బ్యాటింగ్ సరిగా చేయలేకపోవడం వల్లే ఈ మ్యాచ్లో మేము ఓడిపోయాం. టోర్నీమెంట్ ప్రారంభం నుంచి మా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన బాగోలేదు. ఒక్క బట్లర్ మాత్రమే స్థిరంగా రాణిస్తూ వచ్చాడు. జట్టులోని ఆటగాళ్లు బట్లర్ నుంచి చాలా నేర్చుకోవాలి. ఈ పిచ్పై 175-180 పరుగులు చేయవచ్చు. కానీ, మేము 142 పరుగులకే ఆలౌటయ్యాం. రాహుల్ త్రిపాఠి-బట్లర్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏ ఒక్కరూ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు' అని రహానె తెలిపాడు.
అనంతరం ప్లేఆఫ్ అవకాశాల గురించి మాట్లాడుతూ..'క్రికెట్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. మాపై మాకు నమ్మకం ఉంది. తప్పులు జరగకుండా చూసుకుంటాం. లీగ్ దశలో మేము ఇంకా ఒక మ్యాచ్ ఆడాలి. కాబట్టి పాజిటివ్గానే ఆలోచిస్తాం. ఏ క్రికెటర్కైనా తన దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడాలని ఉంటుంది. త్వరలో పాకిస్థాన్తో తలపడే ఇంగ్లాండ్ టెస్టు జట్టులో బట్లర్ చోటు దక్కించుకున్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో మిగతా మ్యాచ్లకు స్టోక్స్, బట్లర్ దూరం కానున్నారు. వీరిద్దరూ పాకిస్థాన్తో టెస్టు ఆడేందుకు స్వదేశానికి వెళ్తున్నారు' అని రహానె వివరించాడు.
టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మే19న జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్లో ప్రస్తుతం రాజస్థాన్ 12పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.