Operation Sindoor: భారత సైన్యం బుధవారం ఉదయం పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. భారత్ ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత సాయుధ దళాలు ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగినట్లు తెలుస్తోంది.
దీని కారణంగా భారత్లో కొనసాగుతున్న ఐపీఎల్ కూడా ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2025 యధావిధిగా కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులు ఐపీఎల్ షెడ్యూల్, మ్యాచ్లపై ఎటువంటి ప్రభావం చూపవని, షెడ్యూల్ చేసిన ప్రకారమే మ్యాచ్లు కొనసాగుతాయని తెలిపాయి.

పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం బుధవారం భారీ చర్య చేపట్టింది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. ఆ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఆపరేషన్ 'సిందూర్' అని పేరు పెట్టబడిన ఈ ఆపరేషన్, జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం), లష్కరే-తోయిబా (ఎల్ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఉగ్ర స్థావరాలపై దాడి
అధికారుల ప్రకారం.. జైష్-ఎ-మహమ్మద్ బలమైన ప్రాంతాలైన బహవల్పూర్, మురిడ్కేలలో అతిపెద్ద ఆపరేషన్లు జరిగాయి. ఇక్కడ 25-30 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా. లష్కరే-తోయిబా ప్రధాన కేంద్రం, ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని మసీదు వా మర్కజ్ తైబాను లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని పాకిస్థాన్ లో ఉగ్రవాదానికి 'నర్సరీ'గా పరిగణిస్తారు. ఇతర ప్రదేశాలలో జరిగిన నష్టాన్ని నిఘా సంస్థలు ఇంకా అంచనా వేస్తున్నాయి. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలలో లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలు, జైష్-ఎ-మహమ్మద్ శిబిరాలు, రాడికలైజేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి జేఈఎం, ఎల్ఈటి రెండింటినీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK)లోని మరో ఐదు ప్రాంతాలను కూడా భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించి, వారి వనరులు, దళాలను మోహరించాయి.