
హైదరాబాద్: ఐపీఎల్ 2018 కోసం అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధమయ్యాయి. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలంను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 4 కల్లా ఏ ప్రాంఛైజీ తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుందో తమకు తెలియజేయాలని ఐపీఎల్ నిర్వాహకులు గడువు కూడా విధించారు.
దీంతో 2018 సీజన్ కోసం ఏ ఆటగాళ్లను తమ ఫ్రాంఛైజీలో కొనసాగించాలన్న దానిపై యాజమాన్యాలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ను వదిలించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 10 సీజన్లు ముగిసిన నేపథ్యంలో 11వ సీజన్కు అందరు ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. అయితే ఇటీవలే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో జరిగిన సమావేశంలో ఫ్రాంఛైజీలు ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునేటట్లు వెసులుబాటు కల్పించాలని కోరింది.
ఈ ప్రతిపాదనపై చర్చించిన ఐపీఎల్ నిర్వాహకులు ముగ్గురు ఇండియన్లు, ఇద్దరు విదేశీయులై ఉండేలా నిబంధన విధించారు. దీంతో ప్రతి ఫ్రాంఛైజీ తమ పాత ఆటగాళ్లను ఐదుగురిని తమ వద్దే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను వేలానికి వదిలేయనుంది. ఇక, వేలానికి ముందు ముగ్గురు, వేలంలో రైట్ టు మ్యాచ్ కింద మరో ఇద్దరిని కొనసాగించుకొనే అవకాశం ప్రతి ఫ్రాంచైజీకే వదిలేసింది.
ఈ లెక్కన ప్రతి జట్టు ముఖ్యమైన ఆటగాళ్లను కొనసాగించుకోవచ్చు. దీంతో కోల్కతా నైట్రైడర్స్ గౌతమ్ గంభీర్ను అట్టిపెట్టుకోకుండా వేలానికి వదిలేయాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గంభీర్ స్పందించాడు. 'ఈ వార్తలు వినగానే ఆశ్యర్యానికి గురయ్యాను. ఇప్పటి వరకు నైట్రైడర్స్ యాజమాన్యం నాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. భవిష్యత్తులో ఆ జట్టులో కొనసాగుతానో లేదో నాకు తెలియదు' అని అన్నాడు.
'ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నా. ఆ తర్వాత నైట్రైడర్స్లో ఆడే దానిపై మేనేజ్మెంట్ను కలిసి మాట్లాడతా. మరో ఫ్రాంఛైజీ తరఫున ఆడేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను' అని గంభీర్ అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అనిపిస్తోంది. కాగా, గంభీర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.