
హైదరాబాద్: 2015లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. #OnThisDay in 2015న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో వన్డేల్లో అత్యంత వేగంగా 150 పరుగులు నమోదయ్యాయి. ఈ రికార్డు సాధించింది మరెవరో కాదు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన ఈ మ్యాచ్లో డివిలియర్స్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో డివిలియర్స్ 66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 162 పరుగులు నమోదు చేశాడు.
తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 150 పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత తన పేరిట లిఖించాడు. డివిలియర్స్తో ఆమ్లా (65), డుప్లెసిస్ (62), రౌస్కోవ్ (61) పరుగులతో వెస్టిండిస్ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు.
అనంతరం 409 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ సఫారీ బౌలర్ల దెబ్బకు 33.1 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో సఫారీలు సాధించిన అతి పెద్ద విజయాల్లో ఇదొకటి.
ఈ మ్యాచ్లో డివిలియర్స్ తుఫాన్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఏబీ డివిలియర్స్కే లభించింది.