అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ (57; 35 బంతుల్లో) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైశ్వాల్ (68; 34 బంతుల్లో), శివమ్ దూబె (63*; 32 బంతుల్లో) మెరుపు అర్ధశతకాలు సాధించారు. విరాట్ కోహ్లి (29; 16 బంతుల్లో) రాణించాడు. రోహిత్ డకౌటయ్యాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో కరీమ్ రెండు వికెట్లు, నవీనుల్, ఫరూకీ చెరో వికెట్ తీశారు.

అయితే అఫ్గానిస్థాన్ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే విఫలమయ్యాడని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అన్నాడు. తొలి మ్యాచ్లో రోహిత్ (0) రనౌటైన విషయం తెలిసిందే. శుభ్మన్ గిల్తో సమన్వయం లోపంతో రనౌటయ్యాడు. రెండో మ్యాచ్లో ఎదుర్కొనే తొలి బంతినే బౌండరీకి ప్రయత్నించి ఫరూకీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మురళీ కార్తీక్ స్పందించాడు.
''ఇక్కడ విఫలమైంది కెప్టెన్ రోహిత్ మాత్రమే. రెండు మ్యాచ్ల్లో పరుగులేమి చేయలేదు. అయితే అతడు దాని గురించి అసలు ఆందోళన చెందడు. ఎంతో కాలం తర్వాత టీ20ల్లోకి తిరిగొచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. తొలి మ్యాచ్లో రనౌటయ్యాడు. రెండో మ్యాచ్లో భారీ షాట్కు ట్రై చేసి ఔటయ్యాడు. కానీ టీమిండియా గొప్పగా ఆడింది'' అని కార్తీక్ అన్నాడు.
14 నెలల తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్ సిరీస్కు ముందు చివరిగా గత టీ20 ప్రపంచకప్ సెమీస్ మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్తో పాటు కోహ్లి పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చారు. జూన్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జనవరి 17న బెంగళూరు వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20 జరగనుంది.