ధోనీకి ప్రత్యామ్నాయంగా..
టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు బ్యాటింగ్ వెన్నెముక. పాదరసంలా కదిలే వికెట్ కీపర్ కూడా. వికెట్ల వెనుక ధోనీ ఉన్న సమయంలో ఫ్రంట్ ఫుట్ ఆడటానికి జంకుతాడు ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేస్తుంటారు. రన్ అవుట్ అయినా, స్టంపింగ్ అయినా మెరుపు వేగంతో వికెట్లను గిరాటు వేయడం మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. వికెట్ల వెనుకల పొంచి ఉండి.. సెకెన్ల వ్యవధిలో బ్యాట్స్మెన్ను పెవిలియన్ పంపించగలడు ధోనీ. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది కూడా. ప్రస్తుత టీమిండియాలో అతని పాటు మరో ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు. దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఈ ముగ్గురూ ఫుల్ టైమ్ వికెట్ కీపర్లే.
దినేష్ కార్తీక్.. వన్డేలకు అతికినట్టు సరిపోయే ఆటతీరు
మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యామ్నాయంగా దినేష్ కార్తీక్ను ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. వికెట్ కీపింగ్ చేయడంతో పాటు ధాటిగా పరుగులు రాబట్ట గల సత్తా దినేష్ కార్తీక్కు ఉంది. ఒత్తిడిని ఎదుర్కొని పరుగులు సాధించడంలో దిట్ట. అనేక వన్డేలను ఆడిన అనుభవమూ అతనికి ఉంది. అందుకే- వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలోనే అతణ్ని తీసుకున్నారు సెలెక్టర్లు. టెస్టుల్లో పెద్దగా అవకాశాలు రాలేదు దినేష్ కార్తీక్కు. వన్డేల్లో మాత్రం రెచ్చిపోయి ఆడుతుంటాడు. వన్డేలు, టీ20 ఫార్మట్లకు దినేష్ కార్తీక్ ఆటతీరు అతికినట్టు సరిపోతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలడు. ఐపీఎల్లో కోల్కత నైట్ రైడర్స్ కేప్టెన్గా దూకుడుగా ఆడాడతను.
కేఎల్ రాహుల్కూ వికెట్ల వెనుక స్థానం అలవాటే!
మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సైతం వికెట్ కీపింగ్ చేయగలడు. కర్ణాటక జట్టుకు అతనే ప్రధాన వికెట్ కీపర్. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకూ రాహులే కీపర్. రాహుల్ను వికెట్ కీపర్గా కంటే బ్యాట్స్మెన్గా గుర్తించే సెలెక్షన్ కమిటీ సభ్యులు అతణ్ని ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నారు. శిఖర్ ధావన్ ఓపెనర్గా ఉన్న సమయంలో రాహుల్ జట్టులో నాలుగో నంబర్ స్థానంలో బ్యాటింగ్కు దిగేవాడు. గాయంతో శిఖర్ ధావన్ వైదొలగిన తరువాత తొలిసారిగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ను ఆరంభించాడు రాహుల్. అటు మిడిలార్డర్ అయినా, ఇటు ఓపెనింగ్ అయినా రెండు చోట్లా చక్కగా రాణించే సత్తా రాహుల్కు ఉంది. పైగా వికెట్ కీపర్ కావడం అతనికి అదనపు బలం. వికెట్ల వెనుక చురుగ్గా కదలగలడనే విషయం ఇప్పటికే ఐపీఎల్లో రుజువైంది.
రిషబ్.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్
ఇక రిషబ్ పంత్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనే ఉండదు. ఐపీఎల్లో ఒక్కసారిగా వెలుగులోకి దూసుకొచ్చాడతను. వికెట్ కీపింగ్తో పాటు జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రాణించాడు. బుల్లెట్ లాంటి షాట్లు ఆడగలడు. ఎలాంటి బౌలర్నయినా ఎదుర్కొనే సామర్థ్యం అతనికి ఉంది. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి తీసుకున్న రిషబ్ పంత్ కూడా పూర్తిస్థాయి వికెట్ కీపరే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన రిషబ్ పంత్ వికెట్ కీపర్గా రాణించాడు. ప్రత్యేకించి- టెస్ట్ మ్యాచ్లల్లో జట్టు వికెట్ కీపర్గా స్థిరపడి పోయాడు. టెస్టుల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అయిన తరువాత ఆయన స్థానంలోకి వృద్ధిమాన్ సాహాను వికెట్ కీపర్గా తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా సాహా గాయపడటంతో రిషబ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.