భారత క్రికెట్ లోకాన్ని కుదిపేసిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ సుందర్ దాస్ తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చేతన్ శర్మ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం బీసీసీఐ వెతుకుతోంది. తాజాగా ఈ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.
ఈ నెల 30వ తేదీ వరకు సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పదవికి ఇచ్చే జీతం తక్కువ అనే భావనతో ప్రముఖ క్రికెటర్లు దీనిపై ఇంట్రస్ట్ చూపించడం లేదనే సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఎంపికైన సెలెక్టర్కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు ఇస్తారా? అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పదవికి అప్లై చేసిన వారిని ఇంటర్వ్యూ ద్వారా బీసీసీఐ ఈ పదవికి ఎంపిక చేస్తుంది.

ప్రస్తుతం శివ సుందర్ దాస్ నేతృత్వంలోని కమిటీలో సలీల్ అంకోలా, సుబ్రతో, ఎస్ శరత్ ఉన్నారు. నార్త్ జోన్కు సంబంధించిన సీటు ఖాళీగా ఉంది. వీరిలో శివ సుందర్ దాస్ ఒక్కడే భారత్ తరఫున 23 టెస్టులు ఆడాడు. మిగతా వారికి పెద్ద అనుభవం లేదు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా.. నార్త్ జోన్ నుంచి ఈ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

గతంలో చేతన్ శర్మను రీఅపాయింట్ చేసే సమయంలో రాత్రాను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసింది. కానీ ఆ తర్వాతి రౌండ్కు రాత్రా ఎంపిక కాలేదు. రాత్రాతోపాటు ప్రముఖ బీసీసీఐ ప్యానెల్ కామెంటేటర్ వివేక్ రాజ్దాన్ పేరు కూడా వినిపిస్తోంది. అతను కూడా ఈ పదవి కోసం పోటీ పడే అవకాశం ఉంది. తన ఉద్యోగరీత్యా ఎన్నో దేశవాళీ మ్యాచులు చూసిన అతను.. కొత్త ట్యాలెంట్ను ఈజీగా గుర్తించే అవకాశం ఉంది.