క్రికెట్ చరిత్రలో సెహ్వాగ్ విధ్వంసక ఓపెనర్:
'ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ పేసర్లపై వీరేందర్ సెహ్వాగ్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేవాడు. హైక్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ని ఎదుర్కోలేడనే విమర్శలను అతను ఉతికారేశాడు. తన దూకుడైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే టెస్టు క్రికెట్లో విధ్వంసక ఓపెనర్గా వీరూ ఎదిగాడు. అతడిలోని అపార ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం కట్టిపడేసేవి' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
ఫార్మాట్ ఏదైనా బాదుడే:
మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ ప్రారంభించిన వీరేందర్ సెహ్వాగ్ ఓపెనర్ అవతారమెత్తాక ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేశాడు. టెస్టు, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా తన బ్యాటింగ్లో బాదుడు తగ్గించని సెహ్వాగ్ భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో ద్విశతకం బాదిన రెండో క్రికెటర్గా చరిత్రల్లోకెక్కాడు. కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 17,253 పరుగులు చేశాడు.
295 వద్ద సిక్సర్:
ప్రత్యర్థి బౌలింగ్ను బాదడమే పనిగా పెట్టుకొని బరిలోదిగే సెహ్వాగ్.. వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలే ఎక్కువ విలువిచ్చాడు. ఇలానే కెరీర్ కొనసాగించాడు. అంతర్జాతీయ స్థాయిలో తమ జట్టు తరఫున ఒక్క ట్రిపుల్ సెంచరీ నమోదు కాని సమయంలో వ్యక్తిగత స్కోరు 295 వద్ద సిక్సర్ కొట్టాలంటే ఏ ఆటగాడైనా ఆలోచిస్తాడు. కానీ సెహ్వాగ్ మాత్రం అలవోకగా సిక్సర్ బాది ట్రిపుల్ అందుకున్నాడు. రెండు సార్లు 300+ మైలురాయిని వీరూ అందుకున్నాడు. ఇప్పటికీ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (319) సెహ్వాగ్ పేరిటే ఉంది.
బంతిని చూడటం, బాదడం:
వన్డేల్లోనూ డబుల్ సెంచరీ బాదిన వీరేందర్ సెహ్వాగ్.. భారత క్రికెట్ చరిత్రలోనే ఓపెనర్గా చెరగని ముద్ర వేశాడు. అయితే పాదాలు కదల్చకుండా ఎక్కువ షాట్లు ఆడే సెహ్వాగ్ బ్యాటింగ్ స్టయిల్పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఫుట్వర్క్ని మార్చుకునేందుకు అతను ఇష్టపడలేదు. విమర్శలు పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా పరుగెత్తకుండా బౌండరీల వర్షం కురిపించడం మనోడి శైలి. 'బంతిని చూడటం, బాదడం' అనే ఫార్మాలాని వీరూ ఫాలో అయ్యాడు.