ఇద్దరు ఆటగాళ్లు గాయపడినా..
ప్రపంచకప్ ఆడటానికి ఇంగ్లండ్ వెళ్లిన భారత క్రికెట్ జట్టు ప్రస్థానం ఒకవంక అద్భుతంగా కొనసాగుతున్నప్పటికీ.. మరోవంక గాయాలు ఆటగాళ్లను వెంటాడుతూనే వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ వేసిన బౌన్సర్ను ఆడబోయి వేలి మీదికి తెచ్చుకున్నాడు శిఖర్ ధావన్. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్లో అదే అతని చివరి మ్యాచ్ అయింది. రెండువారాల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. శిఖర్ ధావన్ ఎడమ చేతి వేలికి అయిన గాయం తగ్గకపోవడంతో మొత్తం టోర్నమెంట్కే దూరం అయ్యాడు. శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ను తుది జట్టులో చోటు కల్పించింది టీమ్ మేనేజ్మెంట్. కీలకమైన నాలుగో స్థానానికి అతణ్ని ఎంపిక చేసింది. వరుసగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్లతో మ్యాచ్లను ఆడాడు. బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
విజయ్ శంకర్ విఫలమైనా..
విజయ్ శంకర్ విఫలమైనప్పటికీ.. వరుసగా అతనికి అవకాశాలు పలకరించాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో విజయ్ శంకర్ 15 పరుగులుతో నాటౌట్గా నిలిచాడు. దాని తరువాతి మ్యాచ్లల్లో రాణించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో 14, వెస్టిండీస్తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మడమల్లో గాయం వల్ల ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్లపై బౌలింగ్ వేయలేకపోయాడు. తాజాగా అతను టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక్కడో విచిత్రం ఏమిటంటే- ఇప్పటిదాకా మయాంక్ అగర్వాల్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. జాతీయ జట్టు తరఫున రెండు టెస్ట్ మ్యాచులు ఆడాడంతే. ఇక టీ20ల్లో ఆడిన అనుభవం మయాంక్ అగర్వాల్కు ఉంది.
అంబటి రాయుడిపై చిన్నచూపు..
నిజానికి విజయ్ శంకర్, మయాంక్ అగర్వాల్లతో పోల్చుకుంటే అంబటి రాయుడు సీనియర్. టీమిండియా తరఫున అంతర్జాతీయ వన్డే మ్యాచ్లను ఆడిన అనుభవం ఉంది. టీ20ల్లో దూకుడుగా ఆడగలడనే పేరూ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. భారత క్రికెట్ జట్టు తరఫున 55 వన్డే మ్యాచ్లను ఆడాడు అంబటి రాయుడు. మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలను సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 124. 79 స్ట్రైక్ రేట్తో అతని బ్యాటింగ్ రికార్డ్ కొనసాగుతోంది.
సీనియర్ను పక్కన పెట్టి..
అలాంటి సీనియర్ను పక్కన పెట్టి.. ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేయడం పట్ల క్రికెట్ అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్కు విజయ్ శంకర్ గాయపడ్డప్పుడే అంబటి రాయుడిని తీసుకుంటారా? లేదా? అనే చర్చ నడిచింది. దీనిపై మెమెలు కూడా తయారయ్యాయి. ఆ ఛాన్స్ రాలేదు. ఇక విజయ్ శంకర్ టోర్నీ మొత్తానకీ దూరమైనప్పుడు సైతం అంబటి రాయుడికి జట్టులో చోటు దక్కనే లేదు. సెలెక్టర్లు అసలు అతని పేరునే పరిశీలించలేదని తెలుస్తోంది.