9 నెలలు జట్టుకు దూరం
ధోనీ దాదాపు 9 నెలలు జట్టుకు దూరంగా ఉండడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. దీంతో మహీ రిటైర్మెంట్పై మరింత ఒత్తిడి నెలకొంది. మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ టోర్నీ ఆడిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ఆడాలంటే ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకోవాలని ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్, చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ధోనీని జట్టులోకి ఎంపిక చేస్తారు? అని గౌతీ ప్రశ్నించాడు.
ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు
తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ... 'ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే.. జట్టులోకి ధోనీ రీఎంట్రీ చాలా కష్టమవుతుంది. 9 నెలలు క్రికెట్ ఆడని అతన్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు?. మైదానంలో ఎవరైతే అత్యుత్తమంగా ఆడి.. జట్టుని గెలిపిస్తారో వారే జట్టులో ఉండాలి. ధోనీ స్థానంలో లోకేష్ రాహుల్ సరైనవాడు. ధోనీకి ప్రత్నామ్నాయం రాహులే. గత కొంతకాలంగా రాహుల్ ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్, కీపింగ్లోనూ ఆకట్టుకుంటున్నాడు. కీపింగ్లో మహీలా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా.. రాహుల్ మాత్రం తన రోల్కు న్యాయం చేస్తున్నాడు' అని అన్నాడు.
రిటైర్మెంట్ మహీ వ్యక్తిగత నిర్ణయం
'టీ20లలో లోకేష్ రాహుల్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్కు వస్తే భారత జట్టుకు లాభిస్తుంది. అతడు పరిమిత ఓవర్లలో బాగా ఆడుతున్నాడు. ఎక్కడైనా బ్యాటింగ్ చేసి పరుగులు చేస్తున్నాడు. ధోనీకి ప్రత్నామ్నాయం రాహులే అని నేను నమ్ముతున్నా. ధోనీ రిటైర్మెంట్ అతని వ్యక్తిగత నిర్ణయం' అని గంభీర్ వెల్లడించాడు. ఐపీఎల్ కోసం ధోనీ దాదాపు రెండు వారాలు సీరియస్గా చెన్నై చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020.. ఏప్రిల్ 15కి వాయిదా పడింది. ఇప్పటికీ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ జరగడంపై సందిగ్ధత నెలకొంది.
రాహుల్పైనే ఎక్కువ ఫోకస్
2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ తర్వాత ధోనీ పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రిషభ్ పంత్కు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించారు. కాగా పంత్ పదే పదే విఫలం కావడంతో అతన్ని తప్పించి రాహుల్ చేత కీపింగ్ చేయించారు. రాహుల్ కీపింగ్, బ్యాటింగ్లో మెరవడంతో.. పంత్ పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పంత్ను పట్టించుకోని టీమిండియా మేనేజ్మెంట్ రాహుల్పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. మరొకవైపు మాజీలు కూడా రాహుల్కే ఓటేయడంతో స్పెషలిస్టు కీపర్ అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు.
పంత్ రెగ్యులర్ ఆటగాడిగా మారాలంటే
ఒకవేళ పంత్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారాలంటే.. వరుసగా కీలక ఇన్నింగ్స్లు ఆడాలి. అందుకు ఐపీఎల్ను వినియోగించుకుందామని పంత్ చూసినా అది జరిగే అవకాశాలు సన్నగిల్లడంతో ఆ యువ వికెట్ కీపర్ డైలమాలో పడ్డాడు. ధోనీ ఎదుర్కొంటున్న పరిస్థితినే పంత్ కూడా చూస్తున్నాడనేది వాస్తవం. పంత్ మాత్రం తన చేతులారా కెరీర్ను నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. కీలక సమయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఆడి వికెట్ సమర్పించుకుని మూల్యం చెల్లించుకున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.