ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్న స్థాయి వేరు. అంతర్జాతీయ అరంగేట్రం నుంచే తన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్కు ముఖచిత్రంగా మారాడు. విదేశాల్లో కొందరు కుర్రాళ్లకైతే తమ దేశ క్రికెటర్లు తెలియరు. కానీ కోహ్లీ మాత్రం తెలుసు. అలాంటి కోహ్లీ చాలా పట్టుదలతో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడుతూ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా వన్డేల్లో ఎడాపెడా సెంచరీలు బాదేస్తూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్నాడు. ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో కోహ్లీ సెంచరీలు బాదాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్లో ఏకంగా 16 సెంచరీలు చేశాడీ మోడ్రన్ గ్రేట్. అయితే ఈ గడ్డపై కోహ్లీ తన తొలి సెంచరీ చేసి 12 సంవత్సరాలు అయిందని తెలుసా?

ఇంగ్లండ్తో జరిగిన ఆ మ్యాచ్లో భారత జట్టు 64 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పుడు కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో రాహుల్ ద్రావిడ్ ఉండగా.. తను అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. ద్రావిడ్ చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచులో 93 బంతుల్లో 107 పరుగులు చేశాడు.
ఆ తర్వాత దురదృష్టవశాత్తూ హిట్ వికెట్గా పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ దిగ్గజ స్పిన్నర్ స్వాన్ వేసిన బంతిని బ్యాక్ ఫుట్పై ఆడిన అతను పరుగు తీసే క్రమంలో వికెట్కు తగిలాడు. దీంతో అతను హిట్ వికెట్గా అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. కోహ్లీ తన కెరీర్లో ఇలా హిట్ వికెట్గా వెనుతిరగడం ఇదే తొలిసారి, చివరి సారి కూడా. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా కోహ్లీ జాగ్రత్తపడ్డాడు.
ఇక ప్రస్తుతం ఆసియా కప్లో కూడా మంచి ఫామ్లో ఉన్న కోహ్లీ.. పాకిస్తాన్పై భారీ శతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంకపై స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. మళ్లీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవాలంటే కోహ్లీ కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది.