సచిన్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు అందరూ జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కుర్రాళ్లు వచ్చారు. ఆ జట్టుతో బరిలో దిగిన టీమిండియా.. అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013 జూన్ 23న ఈ సూపర్ విక్టరీ సాధించింది. దశాబ్దకాలంగా భారత జట్టు మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోవడం గమనార్హం.
వర్షం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను 20 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో టోర్నీ టాప్ స్కోరర్ ధవన్ (31)కి జతకలిసిన విరాట్ కోహ్లీ (43) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత భారత మిడిలార్డర్ కుప్పకూలింది. చివర్లో రవీంద్ర జడేజా (33 నాటౌట్) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.

దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 129/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. ఆ జట్టులో టాపార్డర్ల ట్రాట్ (20) మినహా ఎవరూ రాణించలేదు. అయితే చివర్లో ఇయాన్ మోర్గాన్ (33), రవి బొపారా (30) రాణించారు. వీళ్లిద్దరూ ఇంగ్లండ్ను గెలిపించేలా కనిపించారు. అయితే 18వ ఓవర్లో బంతి అందుకున్న ఇషాంత్ శర్మ అద్భుతం చేశాడు. అప్పటికి మూడు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన అతనికి 18వ ఓవర్ ఇచ్చాడు ధోనీ.
ఈ ఓవర్ తొలి రెండు బంతులకు 8 పరుగులు ఇచ్చిన ఇషాంత్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగే ఇచ్చి, క్రీజులో కుదురుకున్న మోర్గాన్, బొపారా ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. అశ్విన్, జడేజా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 124 పరుగులే చేయగలిగింది. భారత జట్టు ఐసీసీ ట్రోఫీ ముద్దాడింది.

ఈ ట్రోఫీ తర్వాత భారత్ ఆడిన ఏ ఐసీసీ టోర్నీలోనూ గెలవకపోవడం గమనార్హం. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు రాణించినా.. సెమీస్, ఫైనల్స్ చేరుతున్న భారత జట్టు చివర్లో బోల్తా పడుతోంది. గతేడాది చివర్లో టీ20 వరల్డ్ కప్లో కూడా అదే జరిగింది. కొన్నిరోజుల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. మరి ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో అయినా భారత్ తమ సమస్యలు అధిగమించి ట్రోఫీ ముద్దాడుతుందేమో చూడాలి.