సచిన్ డబుల్ సెంచరీ
2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సచిన్ దుమ్ములేపాడు. ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ధాటిగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ, 150 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ నమోదు అయింది. ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ చరిత్రలో నిలిచిపోయాడు.

రిటైర్మెంట్ వయసులో డబుల్ సెంచరీ
ఆ మ్యాచ్లో మొత్తంగా 147 బంతులు ఎదుర్కోన్న సచిన్ 200 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. సచిన్ ఇన్సింగ్స్లో 25 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. స్ట్రైక్రేట్ 136గా నమోదైంది. సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల వయసులో ఈ రికార్డు సృష్టించడం గమనార్హం. సాధారణంగా 37 సంవత్సరాలు అనేది ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే సమయం. కానీ రిటైర్మెంట్ వయసులో సచిన్ చేసిన డబుల్ సెంచరీ క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారింది. అలాగే ఓపెనర్గా వచ్చి అజేయంగా నిలిచిన ఆటగాడిగా కూడా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. అప్పటికీ బలమైన బౌలర్లతో కూడిన జట్టుగా పేరున్న సఫారీలను సచిన్ చీల్చిచెండాడని చెప్పుకోవాలి.

టీమిండియా భారీ స్కోర్
సచిన్ డబుల్ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సచిన్కు తోడుగా దినేష్ కార్తీగ్ 79, ధోని 68*, యూసుఫ్ పఠాన్ 36 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో వేన్ పార్నెల్ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులను భారీగా సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్లో ఏకంగా 95 పరుగులు వచ్చాయి. ఏకంగా డేల్స్టెయిన్ బౌలింగ్లో కూడా 89 పరుగులు వచ్చాయి.

భారత్ ఘనవిజయం
భారత్ విసిరిన 402 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా 248 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 153 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. సఫారీ బ్యాటర్లలో ఏబీ డివిలియర్స్ ఒక్కడే సెంచరీతో పోరాడాడు. సచిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు కూడా డబుల్ సెంచరీ సాధించినప్పటికీ సచిన్ డబుల్ సెంచరీ మాత్రం చరిత్రలో చెక్కు చెదరకుండా నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications












