తొలి వికెట్కు రికార్డు భాగస్వామ్యం
అప్పుడు శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు జరిగాయి. మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా 1-0తో గెలుచుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్ను కూడా టీమిండియా 2-1తో గెలుచుకుంది.
అయితే ఇరు జట్ల మధ్య 3 టీ20 సిరీస్లో భాగంగా ఇండోర్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండడంతో రోహిత్శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. రెండో టీ20లో భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి వికెట్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ రికార్డు స్థాయిలో 12.4 ఓవర్లలోనే 165 పరుగులు జోడించారు.

రోహిత్ శర్మ విశ్వరూపం
ఆ మ్యాచ్లో రోహిత్శర్మ విశ్వరూపం చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అంతర్జాయతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్తో కలిసి రోహిత్ సమంగా నిలిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 43 బంతులాడిన రోహిత్శర్మ 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్లో ఏకంగా 10 సిక్స్లు ఉండడం విశేషం.
మరో 12 ఫోర్లు కూడా ఉండడం గమనార్హం. తన ఇన్నింగ్స్లో కేవలం బౌండరీల ద్వారానే రోహిత్ 108 పరుగులు సాధించాడంటే ఆ మ్యాచ్లో అతని విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు రోహిత్శర్మ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. నాలుగేళ్లు అవుతున్న ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరు మీదనే ఉంది. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు రోహిత్ 4 సెంచరీలు సాధించాడు.

భారత్ ఘనవిజయం
రోహిత్కు తోడు లోకేష్ రాహుల్ కూడా 89 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా మూడో టీ20 మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను భారత జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది.


Click it and Unblock the Notifications












