
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ రెండో యానివర్సరీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆగస్టు 15న ప్రత్యేక నివాళులర్పించింది. 2020లో ఆగస్టు 15న ధోనీ తన అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రిటైర్మెంట్ యానివర్సరీ సందర్భంగా ఐసీసీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో 3:11సెకన్ల క్లిప్ షేర్ చేసింది. ఇందులో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ క్రికెట్ క్షణాలను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతో సహా ఐసీసీ ఈవెంట్లను టీమిండియా ధోనీ సారథ్యంలో గెలుచుకున్న క్షణాలను ఈ వీడియోలో చూపించింది. ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది సేపటికే వేలాది లైకులు పోటెత్తుతున్నాయి.
'ఎంఎస్ ధోనీ: వన్ ట్రిబ్యుట్' 19: 29 గంటల నుండి నన్ను రిటైర్డ్గా పరిగణించండి. 2020లో సరిగ్గా ఇదే రోజు భారత సూపర్ స్టార్ MS ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దిగ్గజానికి నివాళి' అని ఐసీసీ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ధోనీ అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడుకుంటే క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే. 2007లో టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. అతని నాయకత్వంలోనే 2010లో అలాగే 2016లో టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. ఇక 2011లో ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకోవడంలో ధోనీ పాత్ర చాలా కీలకమైంది. ధోనీ కెరీర్లో ఇదే అతిపెద్ద విజయం. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించిన టీమిండియా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.
ధోని అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరొందాడు. అతను జట్టు కోసం అనేక మ్యాచ్లను ఒంటరిగా గెలిపించాడు. అంతర్జాతీయ కెరీర్లో ధోనీ మూడు ఫార్మాట్లలో 17,266పరుగులు చేశాడు. అందులో 15సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 44.96. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ధోనీ హవా మామూలుగా ఉండదు. అతను కెప్టెన్సీ వహించే ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. ధోనీ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలో తనదైన మార్క్ చూపించాడు. ఇక ఐపీఎల్ 2023లో మళ్లీ ధోనీని మనం గ్రౌండ్లో చూడొచ్చు.