డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన వెస్టిండిస్
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన వెస్టిండిస్ను ఓడించి కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా అద్భుతం చేసింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌటైంది.
నిరాశ పరిచిన ఓపెనర్ సునీల్ గవాస్కర్
భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ సునీల్ గావస్కర్(2) ఓపెనర్గా దిగి నిరాశపరచగా, కృష్ణమాచారి శ్రీకాంత్(38), అమర్నాథ్(26), సందీప్ పాటిల్(27), కపిల్ దేవ్(15), మదన్లాల్(17), కిర్మాణి(14), బల్విందర్ సంధు(11), యాష్పల్ శర్మ(11)లు రెండంకెల స్కోరుతో టీమిండియా సాధారణ స్కోరు మాత్రమే చేయగలిగింది.
బౌలింగ్లో రెచ్చిపోయిన టీమిండియా
ఆ తర్వాత బౌలింగ్లో టీమిండియా రెచ్చిపోయింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ను 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ చేసి ఛాంపియన్గా అవతరించింది. మొహిందర్ అమర్నాథ్, మదన్లాల్లు తలో మూడు వికెట్లు తీయగా... సంధు రెండు వికెట్లతో మెరిశాడు.
మ్యాచ్కి హైలెట్గా కపిల్ దేవ్ పట్టిన క్యాచ్
కపిల్దేవ్, రోజర్ బిన్నీలకు తలో వికెట్ తీసి భారత విజయంలో పాలు పంచుకున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లలో వివియన్ రిచర్డ్స్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. విండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ వివియన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ను కపిల్ దేవ్ వెనక్కి పరుగెడుతూ అందుకున్న తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
తొలిసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న టీమిండియా
వివియన్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత వెస్టిండిస్ ఆటగాళ్లు ఒత్తిడిలోకి వెళ్లి వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో ఫైనల్లో 43 పరుగుల తేడాతో వెస్టిండిస్ ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడోసారి సాధించాలన్న విండీస్ ఆశలకు ఆవిరి కాగా, భారత్ తొలిసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది.