న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్లలో విజయవంతమైన కెప్టెన్గానే గాకుండా అత్యంత దూకుడు కలిగిన సారథిగా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ శుక్రవారం(జులై 8న) 44వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెట్లు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహారాజ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

కాగా, నవాబ్ ఆఫ్ నజఫ్గఢ్గా పేరొందిన భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో 'దాదా'కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలాగా కాకుండా భిన్నమైన శైలిలో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్వెస్ట్ ట్రై సిరీస్లో ఇంగ్లాండ్పై భారత్ గెలిచిన తర్వాత అప్పటి కెప్టెన్ గంగూలీ తన షర్ట్ని ఉత్సాహంగా ఊపేస్తాడు.

కాగా, దాదా పుట్టిన రోజు సందర్భంగా సెహ్వాగ్ ఈ ఘటనను గుర్తుచేశాడు. తన షర్ట్ ఎలాగైతే ఊపాడో.. భారత పతాకం కూడా అలా రెపరెపలాడే విధంగా టీమిండియాకు గంగూలీ సహకరిస్తూనే ఉన్నాడని అన్నాడు. అది అలాగే కొనసాగాలని సెహ్వాగ్ ఆకాంక్షించాడు. గంగూలీ సారథ్యంలో సెహ్వాగ్ ఆడిన విషయం తెలిసిందే. సెహ్వాగ్కు ట్విట్టర్లో 6మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
గంగూలీ, సచిన్ టెండూల్కర్లతో తాను ఉన్న ఫొటోను కూడా ఈ సందర్భంగా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు శుక్రవారం ఉదయం 11.40వరకే 1,300మంది లైక్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సెహ్వాగ్ పొగుడుతూ రీట్వీట్లు చేశారు.
టీమిండియాకు ఆడుతున్న సమయంలో సెహ్వాగ్కు గంగూలీ నుంచి పూర్తి సహకారం అందిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని వల్లే తాను టెస్ట్ ఆటగాడిని కూడా అయ్యానని సెహ్వాగ్ పలుమార్లు చెప్పాడు.
అంతేగాక, 'గంగూలీ నా కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నన్ను ఎంతో అభిమానించేవాడు. నాపై నమ్మకం ఉంచేవాడు. అందువల్ల గంగూలీకి కృతజ్ఞతలు. నేను అతనికి ఎంతో రుణపడి ఉంటాను. నాకు టెస్ట్ టీంలో చోటు దక్కిందంటే అది గంగూలీ ఘనతే. నేను టెస్ట్ ఆడకపోయుంటే.. ఇన్ని పరుగులు చేసేవాన్ని కాదు' అని సెహ్వాగ్ గత సంవత్సరం రిటైర్మెంట్ చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.
1996లో టెస్ట్ క్రికెట్ సారథిగా మారిన గంగూలీ 28 టెస్టుల్లో 11 గెలిపించాడు. 113 టెస్టులాడిన గంగూలీ 7,213 పరులు చేశాడు. 311 వన్డేల్లో 11,363 పరుగులు నమోదు చేశాడు. టీమిండియా ఎన్నో విజయాలనందించిన గంగూలీ దాదాగా పేరుతెచ్చుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి గంగూలీ సొంత మైదానం ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం వైదొలిగాడు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.