

హైదరాబాద్: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. తాన ఓ అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచిపోయి దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఐదు వన్డేల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. మంగళవారం రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే ఆలౌటైంది. హసన్ అలీ (45 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు), సర్ఫరాజ్ అహ్మద్ (41; 2 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో (4/22) ఆకట్టుకున్నాడు.
అనంతరం దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి విజయం సాధించింది. వాన్ డెర్ డసెన్ (80 నాటౌట్), ఫెలుక్వాయో (69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయంగా 127 పరుగులు జోడించారు.
అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 37 ఓవర్లో పెహ్లువాకియా బ్యాటింగ్తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ' ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?' అంటూ కామెంట్ చేశాడు.
సర్ఫరాజ్ మాటలు స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డు అవ్వడంతో సర్ఫరాజ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా సర్ఫరాజ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.