
ముంబై: ముంబై రంజీ జట్టుపై ఒమన్ సంచలన విజయం సాధించింది. ఒమన్ సీనియర్ బ్యాట్స్మన్ నసీమ్ ఖుషి వరుసగా మూడు భారీ సిక్సులు బాదడంతో ఒమన్ మొదటి టీ20లో ఊహించని విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 132 పరుగుల లక్షాన్ని ఒమన్ మరో 9 బంతులు ఉండగానే 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 39 ఏళ్ల నసీమ్ ఖుషి 12 బంతుల్లోనే 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో మూడు భారీ సిక్సులు ఉండడం విశేషం. ఖుషి చెలరేగకుంటే.. ఒమన్ ఓడిపోయేదే. ఖుషికి తోడు జీషాన్ మక్సూద్ హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లు అవస్థి, ములని తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టీ20 ప్రపంచకప్ సన్నాహం కోసం ఒమన్ జట్టు ముంబై రంజీ జట్టుతో సొంతగడ్డపై టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20 మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై రంజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏ గోమెల్ 31 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఓమన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు పడుతున్నా.. గోమెల్ క్రీజులో నిలబడ్డాడు. తమోర్ కాస్త దూకుడుగానే ఆడాడు. 14 బంతుల్లో 23 పరుగులు చేశాడు. శామ్స్ మూలన్ 21 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఒమన్ బౌలర్లు మొహమ్మద్ నదీమ్, జీషన్ మక్సూద్, కలీముల్లా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం చేధనకు దిగిన ఒమన్ జట్టు 18.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ జీషాన్ మక్సూద్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఔట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్ చేరడంతో ఓమన్ ఓటమి ఖాయంగా కనిపించింది. ఓమన్ 14 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఇంకా 48 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నసీమ్ ఖుషి చెలరేగి ఆడాడు. ఇక 18 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్లోని మొదటి మూడు బంతులను భారీ సిక్సులుగా మలిచిన ఖుషి.. తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో ఒమన్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన టీ20 ప్రపంచకప్ 2021 కరోనా మహమ్మారి కారణంగా యూఏఈ, ఒమన్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 17న క్వాలిఫికేషన్ రౌండ్ ప్రారంభం కానుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. సూపర్-12లో చోటు దక్కించుకోవాలని చూస్తున్న ఒమన్.. సన్నాహం కోసం ముంబై రంజీ జట్టుతో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్ ప్లాన్ చేసింది. మూడు టీ20, మూడు వన్డేలు ముంబైతో ఒమన్ ఆడనుంది. 29, 31, సెప్టెంబర్ 2న వన్డేలు జరగనున్నాయి.