ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్ జట్టును ఓడించిన తర్వాత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. మ్యాచ్ ముగియగానే ఒమన్ జట్టు ఆటగాళ్లందరూ సూర్యకుమార్ యాదవ్ను చుట్టుముట్టి క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒమన్ జట్టు కెప్టెన్ జతిందర్ సింగ్ బీసీసీఐకి ఓ ప్రత్యేక అభ్యర్థన చేశారు.
సూర్య నుంచి ఒమన్ ప్లేయర్స్ టిప్స్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో సల్మాన్ అలీ ఆఘాతో కరచాలనం చేయని సూర్యకుమార్ యాదవ్.. ఒమన్తో మ్యాచ్ తర్వాత మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్తించారు. మ్యాచ్ ముగియగానే ఒమన్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ను చుట్టముట్టారు. సూర్యకుమార్ యాదవ్ వారికి టీ20 క్రికెట్ లో ఎలా ఆడాలి, ఎలాంటి ప్రణాళికలు ఉండాలి వంటి విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ మాటలు విన్న అనంతరం ఒమన్ ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టి ఆ తర్వాత ఆయనతో ఫోటోలు దిగడానికి వరుసలో నిలబడ్డారు.

ఈ సంఘటనపై ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. సూర్యకుమార్ వచ్చి మా ఆటగాళ్లతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నారు. టీ20 క్రికెట్లో ఎలా ఆడాలి అనేదానిపై ఆయన సలహాలు ఇచ్చారని.. ఈ విషయంలో ఆయనకు చాలా కృతజ్ఞుడినని జతిందర్ సింగ్ పేర్కొన్నారు.
బీసీసీఐని అభ్యర్థించిన జతిందర్ సింగ్
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ బీసీసీఐకి ఓ వినూత్న విజ్ఞప్తి చేశారు. తమ జట్టుకు భారత జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)లో శిక్షణ పొందే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. భారత్ ముందుకు వచ్చి మాక్ ఎన్సీఏలో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తే చాలా సహాయపడుతుందని జతిందర్ సింగ్ అన్నారు. అక్కడ మేము మా నైపుణ్యాలను, మానసిక సంసిద్ధతను, ఫిట్నెస్ను మెరుగుపరుచుకోగలమని అన్నారు. అంతే కాకుండా అక్కడి క్లబ్, రంజీ జట్లతో ఎన్నో టీ20 మ్యాచ్ లు ఆడే అవకాశం లభిస్తుందని.. ఇది ఖచ్చితంగా మాకు మెరుగైన ఆటగాళ్లుగా ఎదగడానికి సహాయపడుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఈ విషయంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.