హైదరాబాద్: రాబోయే మూడు ఒలింపిక్స్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఏం చేయాలో సూచిస్తూ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఈ ఏడాది రియో ఒలింపిక్స్ ముగిశాక ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది సభ్యులతో ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉన్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరెన్ రస్కిన్హా కేంద్ర క్రీడల శాఖ కార్యదర్శి ఇంతేజీ శ్రీనివాస్కు శుక్రవారం తుది నివేదకను సమర్పించారు. ఈ నివేదికలో వివిధ క్రీడాంశాల్లో ఏయే సమస్యలు ఎదురవుతున్నాయి, కోచ్లు, సదుపాయాలు, ప్రతిభావంతులు అన్వేషణ, విదేశీ కోచ్ల ఆవశ్యకత.. ఇలా పలు అంశాలను పొందుపరిచింది.
2020 టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్లను దృష్టిలో ఉంచుకొని.. దీర్ఘకాలిక లక్ష్యంతో ఒలింపిక్ టాస్క్ఫోర్స్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ట్వీట్ చేసింది.
మరోవైపు ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఏం చేయాలనే విషయమై ఈ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ భారత్లోని ప్రధాన నగరాల్లో అథ్లెట్లు, కోచ్లతో పలు దఫాలుగా సమావేశమైంది. ఈ కమిటీ గోపీచంద్, రస్కిన్హాతోపాటు అభినవ్ బింద్రా, ఓం పాఠక్, బలదేవ్ సింగ్, జీఎల్ ఖన్నా, టైమ్స్ గ్రూప్ డిజిటల్ చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, సందీప్ ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు.