లండన్ : 'ఏజ్ బార్..' హేమా హేమీ క్రికెటర్లకు సైతం క్రీజులో ఏజ్ బార్ బాధలు తప్పలేదు. ఏజ్ బార్ కారణంగా వన్నె తగ్గిన ఆటతీరుతో తమ కెరీర్ క్లైమాక్స్ ఇన్నింగ్సుల్లో తడబడ్డ క్రికెటర్లు చాలామందే ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఏజ్ బార్ అవుతున్న కొద్ది రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్.
తాజాగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లాడ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన మిస్బా, వయసు మీద పడ్డాక సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయసు క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 42 సంవత్సరాల 47 రోజుల వయసున్న మిస్బా ఈ తాజా రికార్డు సొంతం చేసుకున్నాడు. కాగా, మిస్బా కంటే ముందు ఈ రికార్డు బాబ్ సింప్సన్ పేరు మీద ఉంది. 41 సంవత్సరాల 359 రోజుల వయసులో ఆయన ఈ రికార్డు సాధించాడు.
ఇక మిస్బా విషయానికొస్తే.. టెస్టు కెరీర్ మొత్తంలో 8 సెంచరీలు చేసిన మిస్బా, అందులో ఐదు సెంచరీలు కెప్టెన్ అయ్యాకే చేయడం గమనార్హం. దీంతో టెస్టుల్లో 8 సెంచరీలు చేసిన ఏకైక పాక్ కెప్టెన్ గా కూడా మిస్బా రికార్డు సాధించాడు. అంతకుముందు మాజీ క్రికెటర్ ఇంజామాముల్ హక్ తో సమానంగా 7 సెంచరీలు సాధించిన కెప్టెన్ గా ఉన్న మిస్బా, తాజా ఇన్నింగ్స్ తో ఇంజమాముల్ ను అధిగమించాడు.

పట్టరాని ఆనందంలో మిస్బా :
ఇకపోతే లార్డ్స్ లో 90 సంవత్సరాల తర్వాత సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగాను, ఈ సెంచరీ ఇన్నింగ్స్ ద్వారా ఘనతను దక్కించుకున్నాడు మిస్బా . ఇన్ని రికార్డులను సొంతం చేసిన తాజా టెస్టు సెంచరీ మిస్బాను పట్టరాని ఆనందంలో ముంచెత్తింది. దీంతో సెంచరీ పూర్తి చేసుకోగానే కృతజ్ఞతగా పాక్ జెండాకు సెల్యూట్ చేశాడు మిస్బా. అనంతరం 10 పుషప్స్ తీయడం ద్వారా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. :
ఇంగ్లాండ్ పాక్ ల మధ్య గురువారం నాడు లార్డ్స్ లో తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తరుపున ఓపెనర్ హఫీజ్ మినహా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమవడంతో 77/3 తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన మిస్బా తొలుత ఆచి తూచి ఆడినా వికెట్లకు అడ్డుకట్ట వేయడంలో సఫలమయ్యాడు.
క్రీజులో కుదురుకోగానే కాస్త చెలరేగడం మొదలపెట్టిన మిస్బా మైదానం నలువైపుల షాట్స్ ఆడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ మొయిన్ అలీ ఓవర్ లో నాలుగు ఫోర్లు బాదిన మిస్బా తద్వారా శతకాన్ని అందుకున్నాడు. దీంతో లార్డ్స్ లో సెంచరీ చేయాలన్న అతని చిరకాల వాంఛ నెరవేరింది.
పుషప్స్ పై వివరణ :
లార్డ్స్ లో సెంచరీ నమోదు చేస్తే పుషప్స్ తీస్తానని పాక్ మిలటరీకి మాటిచ్చినట్టుగా తెలిపాడు మిస్బా. ఇచ్చిన మాట ప్రకారమే సెంచరీ చేయగానే 10 పుషప్స్ తీశానని వివరించాడు. కాగా, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కూడా తాను మిలటరీ ఆధ్వర్యంలోనే శిక్షణ పొందినట్టుగా వెల్లడించాడు.