
హైదరాబాద్: క్రికెట్ను ఆస్వాదించాలంటే అది ఆస్ట్రేలియన్లకే సాధ్యమనిపించేలా చేశారు. పైనున్న ఫోటోను చూస్తే ప్రేక్షకులు సముద్ర తీరంలో సేదదీరుతున్నట్లుగా కనిపిస్తున్నారు కదా! కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. వాళ్లు ఉన్నది ఆస్ట్రేలియాలోని చారిత్రక గబ్బా స్టేడియంలో.
అదేంటి స్టేడియంలో స్విమ్మింగ్ పూలా.. అని ఆశ్చర్యపోకండి. గురువారం గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులు.. ఒకవైపు స్టాండ్స్ తీసేసి, స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేశారు.
అందులో నుంచే మ్యాచ్ వీక్షించే అవకాశం కూడా కల్పించారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్ అలెస్టర్ కుక్ను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత రెండో వికెట్కు స్టోన్మాన్, విన్స్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ పుంజుకుంది. స్టోన్మాన్ 53 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు.
దీంతో రెండో వికెట్కు ఈ జోడీ 125 పరుగులు జోడించింది. ఆ తర్వాత మరో 22 పరుగులకే విన్సీని నాథన్ లయన్ కళ్లు చెదిరే రీతిలో రనౌట్ చేశాడు. ఆంతేకాదు తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. తొలిరోజు 20 ఓవర్లు వేసిన లయన్ 40 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అయితే ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక, కెప్టెన్ జో రూట్ (15) పరుగులకే కమిన్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. పేస్కు సహకరించే బ్రిస్బేన్ మైదానంలో ఆసీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, తొలిరోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ మలాన్(28), మొయిన్ అలీ(13) క్రీజులో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.