టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలో అడుగు పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. గతేడాది వెన్ను నొప్పి కారణంగా అతను జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా లేకపోవడం వల్లనే గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్లో భారత బౌలింగ్ యూనిట్ చాలా బలహీనంగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయినా అతను ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఈ ఏడాది మార్చిలోనే అతనికి న్యూజిల్యాండ్లో వెన్నుకు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకున్న బుమ్రా మళ్లీ జట్టులో చేరడానికి సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో కూడా బుమ్రా ఆడలేదు.

వచ్చే నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అతను ఆడటంలేదని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఏప్రిల్లో మరో ప్రకటన చేసిన బీసీసీఐ.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో బుమ్రా రీహాబిలేషన్లో ఉన్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత అతని ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. పేసర్లకు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్లపై బుమ్రా లేకపోవడం భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు.
ఇలాంటి సమయంలో బుమ్రా పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ అందరిలో ఆసక్తి పెంచుతోంది. కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో బౌలింగ్ స్పైక్స్ ఫొటోను షేర్ చేశాడు. వాటితోపాటు 'హెలో ఫ్రెండ్, మనం మళ్లీ కలిశాం' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బుమ్రా మళ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడని, త్వరలోనే అతను భారత జట్టుతో కలుస్తాడని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాదిలో ఆసియా కప్, అలాగే చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రా పునరాగమనం టీమిండియాకు చాలా కీలకంగా మారనుంది. అతను కనుక జట్టుతో చేరితే భారత బౌలింగ్ బలం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే ఫామ్లో ఉన్న సిరాజ్, షమీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.