ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్కు కొత్త ముహూర్తం ఫిక్స్!
ODI World Cup 2027: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్, తేదీలకు సంబంధించి క్రీడా వర్గాల్లో చర్చ నెలకొంది. టోర్నీని ముందుగా అనుకున్న తేదీ కంటే ముందే ప్రారంభించేలా ఐసీసీ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా ప్లాన్ ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 8న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజా ఆలోచనల ప్రకారం మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న ఈ మెగా టోర్నీని లాంఛనంగా ప్రారంభించాలని ఐసీసీ యోచిస్తోంది. అయితే దీనిపై ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్ను మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభించాలనే ప్రణాళికలో ఓ ప్రత్యేక సందేశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మహాత్మా గాంధీ ప్రపంచమంతటికీ శాంతి, అహింసా సందేశాన్ని వ్యాప్తి చేశారు. అలాగే ఆయనకు దక్షిణాఫ్రికాతో విడదీయరాని అనుబంధం కూడా ఉంది. ఆయన తన జీవితంలో దాదాపు 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలోనే గడిపారు. అందువల్ల దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న క్రికెట్ ప్రపంచ కప్ను గాంధీ జయంతి రోజున ప్రారంభించడం ఒక ప్రతీకాత్మక చర్యగా, ప్రపంచానికి ఓ ప్రత్యేక సందేశాన్ని పంపే అవకాశం ఐసీసీ భావిస్తోంది.

షెడ్యూల్
టోర్నమెంట్కు ముందు అక్టోబర్ 1 నుంచి 7 వరకు వార్మప్ మ్యాచ్లు నిర్వహించాలని ప్రణాళికలు ఉన్నాయి. అయిత, ఇప్పుడు షెడ్యూల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రణాళిక ప్రకారం, ప్రధాన టోర్నమెంట్ అక్టోబర్ 2న ప్రారంభమై.. దానికి ముందు తక్కువ సమయంలో వార్మప్ మ్యాచ్లు నిర్వహించవచ్చు. ప్రపంచ కప్ ఫైనల్ ప్రస్తుతం 2027 నవంబర్ 21న జరుగుతుందని భావిస్తున్నారు. షెడ్యూల్ ఇదే విధంగా ఉంటే, 14 జట్ల ఈ టోర్నమెంట్ సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది.
2027 వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలకు ప్రదానం చేశారు . ఈ మూడు దేశాల కోసం 12 వేదికలను ఐసీసీ ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని ఎనిమిది నగరాలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వీటిలో వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్బర్గ్), సెంచూరియన్, న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ (కేప్ టౌన్), కింగ్స్మీడ్ క్రికెట్ గ్రౌండ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్ఫోంటైన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (క్యుంపో సిటీ, ఈస్ట్ లండన్) ఉన్నాయి. జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), మోసి-ఓ-టున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్) ఎంపిక చేయబడ్డాయి. నమీబియా రాజధాని విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ 12వ వేదికగా ఉంటుంది.
మారిన ప్రపంచ కప్ ఫార్మాట్
2027 వన్డే ప్రపంచ కప్ కేవలం తేదీనే కాకుండా టోర్నమెంట్ ఫార్మాట్ను కూడా మార్చింది. కొత్త ఫార్మాట్ ప్రకారం, అత్యల్ప ర్యాంకులో ఉన్న మూడు జట్లు మొదటగా సూపర్ సిరీస్ అని పిలువబడే ఓ మినీ-లీగ్లో ఆడతాయి. ఈ సూపర్ సిరీస్ విజేత, ప్రధాన టోర్నమెంట్లో పాల్గొనే 11 జట్లతో కలిసి 12 జట్ల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపులలోని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. గ్రూప్ దశ తర్వాత, సూపర్ సెవెన్ దశ ఉంటుంది. దీని తర్వాత సెమీ-ఫైనల్స్, ఆపై ఫైనల్ జరుగుతాయి.
భారత్తో సహా అర్హత సాధించిన 10 జట్లు
2027 ప్రపంచ కప్కు ఇప్పటివరకు 10 జట్లు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. సహ-ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే క్వాలిఫైయర్ల ద్వారా మిగిలిన నాలుగు జట్లను నిర్ణయిస్తారు. ఈ క్వాలిఫైయర్లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. సహ-ఆతిథ్య దేశమైన నమీబియాతో పాటు వెస్టిండీస్, ఐర్లాండ్ ఈ జాబితాలో ఉన్నాయి. అంటే 2027 వన్డే ప్రపంచ కప్కు ఎంపికయ్యే జట్ల పూర్తి జాబితా ఇంకా ఖరారు కాలేదు, కానీ ఐసీసీ కొత్త ప్రణాళికకు ఆమోదం లభిస్తే, ఈ టోర్నమెంట్ను 2027 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

