అక్లాండ్: ప్రస్తుతం శ్రీలంక జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. రెండు టెస్ట్ మ్యాచ్లు, మూడు చొప్పున వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్లో తలపడుతోంది. ఇందులో రెండు టెస్టులను క్లీన్ స్వీప్ చేసింది కివీస్. మూడు వన్డేల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. మిగిలిన రెండింటినీ న్యూజిలాండ్ జట్టే కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నడుస్తోంది. తొలి మ్యాచ్ను శ్రీలంక గెలుచుకుంది. తాజాగా రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింది. 1-1తో సమవుజ్జీగా నిలిచింది.
చివరిదైన మూడో టీ20 ఈ నెల 8వ తేదీన షెడ్యూల్ అయింది. క్వీన్స్టౌన్ ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. డ్యునెడిన్లో తాజాగా ముగిసిన రెండో టీ20లో తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టి కరిపించింది న్యూజిలాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లల్లో 141 పరుగులకే ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా-37, కుశాల్ పెరీరా-35, చరిత్ అసలంక-24, కుశాల్ మెండిస్-10, పాథుమ్ నిశ్శంక-9, వనిందు హసరంగ-9 పరుగులు చేశారు.

న్యూజిలాండ్ ఏస్ బౌలర్ ఆడమ్ మిల్నె అయిదు వికెట్లు కూల్చాడు. తన నాలుగు వికెట్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. బెన్ లిస్టర్-2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ చెలరేగింది. 14.4 ఓవర్లల్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు ఛాద్ బోవెర్స్-31, టిమ్ సీఫర్ట్-79, టామ్ లాథమ్-20 పరుగులు చేశారు. 43 బంతుల్లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో టిమ్ సీఫర్ట్ 79 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
శ్రీలంక బౌలర్లెవరూ రాణించలేదు. కసున్ రజిత ఒక్కడే ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆడమ్ మిల్నె సంధించిన ఓ డెలివరీ ధాటికి- పాథుమ్ నిశ్శంక బ్యాట్ విరిగిపోయింది. హ్యాండిల్ చేతికి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్ తొలి ఓవర్లోనే ఈ ఘటన సంభవించింది. మిల్నె సంధించిన స్ట్రెయిట్ డెలివరీని డిఫెన్స్ ఆడాడు నిశ్శంక. బ్యాట్ను అడ్డు పెట్టాడు. పిచ్పై పడి లేచిన బంతి- బ్యాట్ పైఅంచును తాకింది. ఆ వెంటనే హ్యాండిల్ ఊడి చేతికొచ్చింది.