క్రికెట్లో సరికొత్త చరిత్ర.. టీమిండియా రికార్డును తుడిచిపెట్టేసిన న్యూజిలాండ్!
మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో బుధవాపం ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. వెల్లింగ్టన్లోని ప్రసిద్ధ బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించింది. ఈ పోరులో న్యూజిలాండ్ మహిళల జట్టు ఏకంగా 347 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి.. వన్డే చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కివీస్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
టీమిండియా రికార్డు గల్లంతు
న్యూజిలాండ్ సాధించిన ఈ అద్భుత విజయంతో భారత మహిళల జట్టు పేరిట ఉన్న గత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గతేడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాపై భారత్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అప్పట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా నిర్దేశించిన 347 పరుగుల కొండంత లక్ష్యాన్ని కివీస్ ఛేదించడంతో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఉమెన్స్ క్రికెట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతుందనడానికి న్యూజిలాండ్ సాధించిన ఈ విజయమే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమేలియా కెర్ విశ్వరూపం
న్యూజిలాండ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ అమేలియా కెర్ కీలక పాత్ర పోషించింది. 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జట్టు వికెట్లు కోల్పోతున్నా.. అమేలియా కెర్ మాత్రం చివరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చింది. కేవలం 139 బంతుల్లో 23 ఫోర్లుస ఒక సిక్సర్తో అజేయంగా 179 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. నాడిన్ డిక్లర్క్ బౌలింగ్లో వరుసగా మూడు ఫోర్లు బాది 2 బంతులు మిగిలి ఉండగానే కివీస్ జెండాను ఎగురవేసింది. ఆమెకు ఇసాబెల్లా గేజ్ (68) నుంచి లభించిన సహకారం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.
దక్షిణాఫ్రికా భారీ స్కోరు వృథా
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (69), అనీకే బోష్ (91) అద్భుతమైన పునాది వేయగా.. చివర్లో క్లో ట్రయాన్ కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులతో మెరుపులు మెరిపించింది. ఇంతటి భారీ స్కోరు చేసినా.. అమేలియా కెర్ విధ్వంసం ముందు దక్షిణాఫ్రికా బౌలర్లు నిలవలేకపోయారు. అయాబొంగా ఖాకా 3 వికెట్లు తీసి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
సిరీస్ నిర్ణయాత్మక దశకు..
ఈ అద్భుత విజయం తర్వాత మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే చివరి, నిర్ణయాత్మక వన్డే ఏప్రిల్ 4న ఇదే వేదికగా జరగనుంది. ఒకే మ్యాచ్లో రెండు జట్లు కలిపి దాదాపు 700 పరుగులు సాధించడం మహిళల క్రికెట్ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచమంతా ఏప్రిల్ 4న జరగబోయే ఫైనల్ పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications