NZ vs PAK: పాకిస్థాన్ జట్టు 5 మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో పాకిస్థాన్ జట్టును న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. అంతకు ముందు రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్.. మూడో వన్డేలో శనివారం 43 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే టీ-20 సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు.. వన్డే సిరీస్ కూడా క్లీన్ స్వీప్ కావడంతో దాయాది జట్టు విచారాన్ని వ్యక్తం చేసింది. కివీస్ తో మూడో వన్డే తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్ధిల్ షా అనుచిత ప్రవర్తన నెట్టింట వైరల్గా మారింది. ఖుష్దిల్ షా ఏకంగా అభిమానులను కొట్టడానికి పరిగెత్తాడు.
న్యూజిలాండ్పై పాకిస్థాన్ మూడో వన్డేలో ఓటమి తర్వాత ఖుష్దిల్ షా అభిమానుల మీదకు దూసుకెళ్లిన వీడియో వైరల్ గా మారింది. పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఓటమి తర్వాత కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీని తర్వాత పాకిస్థాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా తనను తాను నియంత్రించుకోలేక అభిమానులతో గొడవపడ్డాడు. భద్రతా సిబ్బంది కూడా ఖుష్దిల్ షాను ఆపడానికి ప్రయత్నించారు . కానీ అతను ఆగలేదు.

ఫ్యాన్స్ వ్యాఖ్యల కారణం సహనం కోల్పోయిన ఖుష్దిల్ షా
మూడో వన్డే ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానం నుంచి వెళ్లిపోతున్నప్పుడు పాక్ అభిమానులు తమ సొంత ఆటగాళ్లపై అనుచితంగా ప్రవర్తించారు. ఖుష్దిల్ షా దానిని తట్టుకోలేక అభిమానులతో వాగ్వాదానికి దిగాడు. వైరల్ అవుతున్న ఫోటోలు వీడియోలలో ఖుష్దిల్ షాను ఆపడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించడం చూడవచ్చు. "మౌంట్ మౌంగనుయ్ లో ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించారు. ఖుష్దిల్ షా వారిని ఆపమని కోరాడు. కానీ వారు ఖుష్దిల్ షాను దుర్భాషలాడడంతో.. అతను అభిమానులను కొట్టేందుకు పరిగెత్తాడు."అని జర్నలిస్ట్ ఇమ్రాన్ సిద్ధిక్ వెల్లడించాడు.