
సత్తా చాటిన బౌలర్లు
మొదట భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అమేలి కేర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ మరో సారి హాఫ్ సెంచరీ (66)తో రాణించింది. మిగతా వారిలో కెప్టెన్ డివైన్ 34, లారెన్ డౌన్ 30, జెన్సన్ 30 పరుగులతో పర్వాలేదనిపించారు.
ఇక మిగతా వారంతా తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో గయాక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ రానా రెండేసి వికెట్లు తీయగా.. పూనమ్ యాదవ్, మేఘన సింగ్ తలో వికెట్ తీశారు.

చెలరేగిన భారత బ్యాటర్లు
అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (71), హర్మన్ ప్రీత్ కౌర్ (63), కెప్టెన్ మిథాలీ రాజ్ (57*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ (21), షఫాలీ వర్మ (9), రిచ్ ఘోష్ (7*) పరుగులు చేశారు.
కివీస్ బౌలర్లలో జేన్సన్, అమేలీ కేర్, జోన్స్, హన్నా రోవ్ తలో వికెట్ తీశారు. వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఆడిన భారత అమ్మాయిలు ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కివీస్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేశారు. 71 పరుగులతో చెలరేగిన ఓపెనర్ స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. ఇక సిరీస్ అసాంతం అదరగొట్టిన కివీస్ ప్లేయర్ అమేలి కేర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకుంది.

సిరీస్ కివీస్ కైవసం
చివరి వన్డే మ్యాచ్లో ఓడినప్పటికీ 5 మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ మహిళల జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ జట్టు తొలి 4 వన్డే మ్యాచ్ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా కివీస్ ప్లేయర్ అమేలి కేర్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సిరీస్ మొత్తం బ్యాట్తో దుమ్ములేపిన అమేలి బాల్తోనూ రాణించింది.


Click it and Unblock the Notifications
