హైదరాబాద్: మౌంట్ మగాని వేదికగా ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయినా... బ్యాట్స్మెన్ మాత్రం అద్భుత ప్రదర్శన చేశారు.
చివరి వరకు ఉత్కంఠ: తొలి టెస్ట్లో 4 పరుగుల తేడాతో పాక్ ఓటమి
గత శుక్రవారం న్యూజిలాండ్-ఏ జట్టుతో ఆరంభమైన ఈ అనధికార టెస్టులో నాలుగో రోజైన సోమవారం పృథ్వీ షా (50: 53 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్), మురళీ విజయ్ (60: 113 బంతుల్లో 8 ఫోర్లు), హనుమ విహారి (51: 63 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలు చేశారు.
దీంతో ఇండియా-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్లో 247/3తో నిలిచింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ జట్టు 467 పరుగులు చేయగా అనంతరం న్యూజిలాండ్-ఏ జట్టు 458 పరుగులు చేసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్లో కేవలం 9 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న భారత్ రెండో ఇన్నింగ్స్లో 247/3తో నిలిచిన దశలో మ్యాచ్ని అంఫైర్లు నిలిపివేశారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ పృథ్వీ షా, హనుమ విహారి హాఫ్ సెంచరీలతో చెలరేగగా... రెండో ఇన్నింగ్స్లో మురళీ విజయ్, రహానే హాఫ్ సెంచరీలు సాధించారు.
డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పృథ్వీ షా, హనుమ విహారి, మురళీ విజయ్, రహానేలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్-ఏ జట్టుతో తలపడే ఇండియా-ఏ జట్టు తరఫున ఆడే అవకాశం వీరికి జట్టు మేనేజ్మెంట్ కల్పించింది. వాస్తవానికి రోహిత్ శర్మ కూడా ఈ తొలి అనధికార టెస్టు మ్యాచ్లో ఆడి ఉండాల్సింది. అయితే, చివరి నిమిషంలో సెలక్టర్లు అతడిని తప్పించారు.