
హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్ను 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
రెండో టెస్టులో కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మరోవైపు బంగ్లాదేశ్ టాపార్డర్ పేలవ ప్రదర్శన చేయడంతో మరో సిరీస్ను కోల్పోయింది. రెండో టెస్టులో 80/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 211 పరుగులకు ఆలౌటైంది. చివరిరోజు ఆటలో భాగంగా మరో 131 పరుగులు మాత్రమే చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది.
దీంతో ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నెర్కు నాలుగు... ట్రెంట్ బౌల్ట్ మూడు.. సౌథీ, గ్రాండ్హోమ్, మ్యాట్ హెన్రీలు తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ పర్యాటక జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం న్యూజిలాండ్ జట్టులో రాస్టేలర్ డబుల్ సెంచరీ సాధించగా.. హెన్రీ నికోలస్ సెంచరీ బాదడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాస్ టేలర్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు.
తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్లో సిక్స్ ద్వారా తన కెరీర్లో 18వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. మూడో వికెట్కు విలియమ్సన్తో కలిసి 172 పరుగులు, నాలుగో వికెట్కు నికోల్స్ జతగా 216 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. డబుల్ సెంచరీ తర్వాత మరుసటి బంతికే టేలర్ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన రాస్ టేలర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.