కోల్కతా: తమ జట్టు ఇండియన్ ప్రీమియర్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తమ జట్టు రెండోసారి ఐపిఎల్ ఛాంపియన్గా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తానిప్పుడు క్రికెట్ను ప్రేమిస్తున్నానని చెప్పారు.
ఆదివారం జరిగిన మ్యాచులో చెన్న సూపర్ కింగ్స్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం ఐపిఎల్-8 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత నీతా అంబానీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మొదలైనప్పుడు తనకు అసలు క్రికెట్ గురించి తెలియదని ఆమె వెల్లడించారు.
'మొదటి, రెండు ఐపీఎల్ వరకు క్రికెట్ గురించి అసలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్రికెట్ను అభిమానిస్తున్నా. మా టీమ్ కు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచిన అభిమానులను ఇష్టపడుతున్నా' అని నీతా అంబానీ తెలిపారు. వాంఖేడ్ మైదానంలో మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని తమ జట్టు చెన్నైని ఓడించిన తర్వాత తామే విజేతగా నిలుస్తామని నమ్మకం ఏర్పడిందని తెలిపారు.
తమ జట్టు సాధించిన విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం జట్టు సభ్యులకే దక్కుతుందని నీతా అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ అన్నారు. 10 మ్యాచుల్లో 9 విజయాలు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. టైటిల్ సాధించేందుకు తమ ఆటగాళ్లు చాలా కష్టపడ్డారని అన్నారు.