నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ ఫ్యాన్స్ పాలిట అది ఒక బ్లాక్-డే. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ రోజు టీమిండియా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోలేదు.. కాట్లాది మంది అభిమానుల కలలు, ఆశలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఏళ్ల తరబడి చేసిన కఠోర శ్రమ, అద్భుతమైన ప్రదర్శన ఒక్క ఫైనల్ ఓటమితో వృథా అయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్షన్నర మందికి పైగా ప్రేక్షకులతో నిండి ఉన్నా.. అదంతా ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారింది. అంతిమ క్షణంలో వచ్చిన నిశ్శబ్ధం గుండెల్ని బద్ధలు చేసింది. సరిగ్గా ఇదే రోజున 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
విజయ రథాన్ని ఆపిన ఆస్ట్రేలియా
2023 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి భారత్ అద్భుతమైన ఫామ్లో ఉంది. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అజేయంగా ఫైనల్కు చేరుకుంది. లీగ్ దశలో, సెమీ-ఫైనల్లో భారత్ చూపించిన ఆధిపత్యం చూసి 2011 ప్రపంచకప్ అద్భుతం ఖచ్చితంగా పునరావృతమవుతుందని యావత్ దేశం నమ్మింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ క్రీడాభిమానులు టీమిండియా విజయం కోసం ప్రార్థనలు చేశారు. అయితే, కీలకమైన ఫైనల్ రోజున, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా తమ అనుభవాన్ని ప్రదర్శించి భారత జట్టును ఓడించి, తమ ఆరో వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది.

రోహిత్ కన్నీళ్లు.. కోహ్లీ నిరాశ
ఆ రాత్రి టీవీ తెరలపై కనిపించిన దృశ్యాలు దేశాన్ని కన్నీటిలో ముంచెత్తాయి. కెప్టెన్గా టోర్నమెంట్ను ముందుండి నడిపించిన రోహిత్ శర్మ కళ్లల్లో నీళ్లు నిండిన దృశ్యం ప్రతి భారతీయుడి గుండెను మెలిపెట్టింది. నాయకుడి నిరాశ దేశం మొత్తానికి ప్రతిబింబంగా మారింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడిగా, అసాధారణమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ తలవంచుకున్న తీరు... కోట్లాది అభిమానుల ఆవేదనను తెలియజేసింది. బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన నిస్సత్తువ, వారు ఎంతటి విజయాన్ని కోల్పోయారో స్పష్టం చేసింది. ట్రోఫీ కేవలం అంగుళాల దూరంలో ఉండి కూడా దక్కకపోవడం ఆ జట్టుకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
నిశ్శబ్ధంలో మునిగిపోయిన యావత్ దేశం
ఆ ఓటమి ప్రభావం కేవలం స్టేడియానికే పరిమితం కాలేదు. దేశంలోని ప్రతి పల్లెటూరు, గల్లీలు, కార్యాలయాలు, సోషల్ మీడియా అంతటా ఓ భయంకరమైన నిశ్శబ్ధం ఆవరించింది. ఆ రాత్రి అదృష్టం భారత్ వైపు లేకపోవడం, ఆస్ట్రేలియా ప్రదర్శించిన అద్భుతమైన ఫీల్డింగ్, ట్రావిస్ హెడ్ సెంచరీ ఆశించిన విజయాన్ని దూరం చేశాయి.
ఈ టోర్నమెంట్లో భారత్ ఆడిన అద్భుతమైన ఆట మర్చిపోలేనిది. విరాట్ కోహ్లీ 11 మ్యాచ్లలో 765 పరుగులతో (3 సెంచరీలు) 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచారు. రోహిత్ శర్మ అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 597 పరుగులు చేసి, జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందించారు.మహ్మద్ షమీ కేవలం ఏడు మ్యాచ్లలో 24 వికెట్లు తీసి, మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు కూడా కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నల్ ఓటమి తరువాత నిరాశతో ఉన్న జట్టును ఓదార్చడానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు. ఆ రాత్రి యావత్ భారతం తమ క్రికెట్ వీరుల కోసం కన్నీరు పెట్టుకుంది.