
అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సెంచరీల వీరుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత మూడేళ్లుగా ఏ ఫార్మాట్లలోనూ అతను సెంచరీ చేయలేదు. చివరిసారిగా 2019లో నవంబర్ 22న బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక డే అండ్ నైట్ టెస్ట్లో కోహ్లీ సెంచరీ బాదాడు. ఇక ఆ తర్వాత అతని బ్యాట్ నుంచి సెంచరీ జాలువారలేదు. అయితే ఇటీవల కోహ్లీ మరింత ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో చేదు ఐపీఎల్ సీజన్ను చవిచూశాడు. కెప్టెన్సీ వదులుకున్నా అతను బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమవుతూనే ఉన్నాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతున్నాడు. అతను ఈ పర్యటనలో పూర్తిగా విఫలమయ్యాడు. మూడు ఫార్మాట్లలో అతను వసరుగా 11, 20, 1, 11, 16 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక అతను ఫామ్ కోల్పోవడంపై చాలా మంది అతని అభిమానులు వర్రీ అవుతున్నారు. కోహ్లీ మునుపటి ఫాం పుచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఇక క్రికెట్ ఉద్ధండులు సైతం కోహ్లీ ఆటతీరు పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు అతను జట్టుకు భారం అవుతున్నాడని, అతన్ని తప్పించాలని కోరుతుండగా.. మరికొందరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ఇంకొందరు రంజీల్లో ఆడి ఫామ్ అందుకుని తిరిగి జట్టులోకి రావాలని సలహాలు ఇస్తున్నారు. ఇక ఇటీవల పాక్ క్రికెటర్ బాబర్ ఆజం.. కోహ్లీకి మద్దతుగా ట్వీట్ చేశాడు. దిస్ టు షల్ పాస్ స్టే స్ట్రాంగ్ కోహ్లీ అంటూ ట్వీట్ చేయడం ట్రెండింగ్ అయింది. ఇక కెవిన్ పీటర్సన్ సైతం అదే తరహా పోస్టు చేశాడు.
పీటర్సన్ తన ఇన్స్టాలో స్పందిస్తూ.. 'మిత్రమా మీ కెరీర్లో కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలున్నాయి. అవి మీలాంటి క్రికెటర్లు మాత్రమే చేయగలిగినవి. అందుకే మీరు మునుపటిలా ఆడాలని కోరుకుంటారు. ఏదేమైనా మీ కెరీర్ పట్ల ఎప్పటికీ గర్వంగానే ఉండండి. మీ కెరీర్ను ఆనందించండి. ఇంకా మీ ముందు చాలా మార్గం ఉంది. మీరు తిరిగి పుంజుకుంటారు' అని పీటర్సన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక పీటర్సన్ చేసిన ఈ పోస్టుకు టెన్నిస్ స్టార్, ఇటీవల వింబుల్డన్ విజేత నొవాక్ జకోవిచ్ సైతం లైక్ చేశాడు. జొకోవిచ్, కోహ్లీ మధ్య మిత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే.