IPL 2025 Sunrisers Hyderabad: ఎట్టకేలకు సొంతగడ్డ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని రెండు అలవోకగా ఛేదించింది. సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కలిసి లక్ష్యాన్ని ఉఫ్ అంటూ ఊదేశారు. తొలి వికెట్కు వీరిద్దరు కలిసి 171 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ విజయం అనంతరం ట్రావిస్ హెడ్.. ఆనందం వ్యక్తం చేశాడు. కీలక విషయాల గురించి మాట్లాడాడు.
ఈ రాత్రి అసాధారణం..
"మేం మళ్లీ విజయం సాధించడం చాలా బాగుంది. ఈ రాత్రి అసాధారణంగా సాగింది. ఈ విజయం మాకు అత్యంత అవసరం. మధ్యలో పరిస్థితులు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ.. మేం బానే రాణించాం. మొదట్లో కాస్త ఓపికతో ఉన్నాం. మా కోసం వాళ్లు పక్కా ప్రణాళికలతో వస్తారని తెలుసు. మేం గత ఏడాది ఎలా అయితే ఆడామో.. ఇప్పుడు అదే చేశాం. అదే మాకు మంచి భాగస్వామ్యం ఫలితాలను ఇస్తోంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, లక్ష్యాలను ఎంచుకుంటూ ఆడుతున్నాం. ఈ పిచ్పై 270-280 పరుగులు కూడా చూశాం. ఇక్కడ భిన్నమైన పిచ్లపై ఆడాం. రెండో పిచ్ ఎక్కువ స్కోర్లు ఇచ్చేలా కనిపించింది. ఈ రోజు ఇక్కడ 240 పరుగులు ఛేదన చేయడానికి ప్రతీదీ కలిసొచ్చింది. " అని హెడ్ చెప్పుకొచ్చాడు.

కాగా, సన్రైజర్స్ ఇన్నింగ్స్లో 9వ ఓవర్ లో మ్యాక్సీ బౌలింగ్ లో హెడ్ వరుసగా రెండు సిక్స్లు కొట్టాడు. దీంతో కాస్త అసహనానికి గురైన మాక్స్వెల్.. క్రీజ్లో ఉన్న హెడ్ వైపునకు బంతిని విసిరాడు. దీంతో హెడ్.. మ్యాక్సీ దగ్గరికి వెళ్లి ఏదో కాస్త ఘాటుగానే అన్నాడు. అప్పుడు స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే మరో ప్లేయర్ సొయినిస్, అంపైర్ వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశాడు. కాగా, ఈ ముగ్గురూ ఆసీస్కు చెందిన ఆటగాళ్లే కావడం గమనార్హం.